మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు
ఒక చిన్న సమస్య పరిష్కారం అయిందనుకుంటే.. ఆ స్థానంలో మరో పెద్ద సమస్య వచ్చిపడినప్పుడు ‘మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు’ అనే సామెతను ఉదహరిస్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితులకు ఇది చక్కగా సరిపోలుతుంది కూడా. మొదటి వేవ్ తర్వాత కరోనా సమస్య తీరిపోయిందనుకున్న తరుణంలో.. సెకండ్వేవ్ వ్యాపించింది. దీంతో మరణాలు కూడా అధికంగానే సంభవించాయి. రెండు వేవ్లు తగ్గాయని సంబురపడేలోపే.. ఒమిక్రాన్ రూపంలో మూడో వేవ్ ముంచుకొచ్చింది. థర్డ్వేవ్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు జానపదులు ఈ సామెతనే వాడుతున్నారు. మక్క(మొక్కజొన్న)లు తినేవాడి పీడ విరగడ అయిందని సంబురపడే లోపే, వాడి స్థానంలో జనాన్ని పీక్కుతినేవాడు వచ్చాడట. ఈ సామెత దేశ రాజకీయాలకూ
వర్తిస్తుంది. వచ్చేకాలమంతా పోయేకాలమే!
ఊదుడు బుక్కుడు ఊరుముఖం సూసుడు
భవిష్యత్ ప్రణాళిక లేకుండా, తాత్కాలిక సుఖాల కోసం ఉన్నదంతా ఖర్చు చేసుకునే వాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. కొందరంతే. ఉన్నది మిగలకుండా ఊడ్చేసి, తీరా మంది ముఖాలవైపు చూస్తుంటారు. ఉన్నప్పుడు అవసరానికి మించి ఖర్చులు పెట్టి, మళ్లీ అప్పుల కోసం చూసే రకాలు అక్కడక్కడా తారసపడుతుంటారు. ఎప్పటిదప్పుడే ఓడజేసుకొని మందిమీద పడుతుంటారు. వెనుకటికి వడ్లు దంచి బువ్వ వండేటోళ్లు. రోకటిపోటు పడ్డంక చాటతోని చెరిగి, కోడి
మెరిగెలు, నూకలు, బియ్యం వేరు చేసేటోళ్లు. ఈ తతంగానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా దంచిన వడ్లను కొద్దికొద్దిగా చేతుల్లో పోసుకొని, పొట్టు ఊదగా మిగిలిన బియ్యాన్ని బుక్కేవారు కొందరు. అవికాస్తా అయిపోగానే మళ్లీ జనంవైపు చూసేవాళ్లు. అందుకే జీవితం, పని విషయంలో కచ్చితంగా ప్రణాళిక ఉండాలని హెచ్చరిస్తూ ఈ సామెతను చెప్పారు పెద్దలు.
వాడు బత్తీస్మార్గాడు తెలుసా?
తీస్మార్గాడు, బత్తీస్మార్గాడు, చత్తీస్మార్గాడు.. అనేవి వ్యంగ్యమైన వ్యక్తీకరణలు. చిన్నప్పుడు ఈగలను చంపే ఆట ఉండేది. చంపిన ఈగల సంఖ్యను బట్టి రకరకాల బిరుదులు ఇచ్చేవాళ్లు. బత్తీస్మార్గాడు అంటే.. 32 మందిని చంపినవాడు/32 ఈగలను చంపినవాడు అని అర్థం. బత్తీస్మార్గాడు అనే పలుకుబడి ఔరంగజేబు చరిత్ర నుంచీ పుట్టుకొచ్చిందని చెబుతుంటారు. కారణం, నిర్మల్ జిల్లాలో బత్తీస్గఢ్ పేరుతో ఓ కోట ఉంది. 17వ శతాబ్దంలో ఔరంగజేబు దండయాత్రల నుంచి తప్పించుకోవడానికి దీన్ని నిర్మించారని అంటారు. దీనికి 32 ద్వారాలు ఉన్నాయి. ఎనిమిది దిక్కుల నుంచి చూసినా ఈ ద్వారాలన్నీ నాడు ఒకేలా ఉండేవట. బత్తీసలు అంటే 32 చక్కెర చిలుకల హారం. తిరునాళ్లు, జాతర్లలో అమ్ముతారు.
డప్పు రవి
బొమ్మలు మృత్యుంజయ్