ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటల సాగు జోరందుకున్నది. ప్రధానంగా వేరుశనగ, కంది సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కంది చేలు పూత దశలో ఉన్నాయి. తెగుళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నష్ట నివారణతోపాటు అధిక దిగుబడి సాధించవచ్చని తిరుమలగిరి వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిమిసంహారక మందులను మోతాదు తగ్గట్టు వాడితే అధిక దిగుబడి, లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. కంది సాగులో యాజమాన్య పద్ధతులను ఆయన వివరించారు.
కంది పంటలో పూత దశ కీలకం. ఈ సమయంలో నీటి ఎద్దడి ఉన్నా లేదా అవసరానికి మించి నీరు పెట్టినా పూత రాలిపోతుంది. పూత రాలకుండా 8-10లీటర్ల నీటికి ప్లానోఫిక్స్ రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి 10రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కలపై పిచికారీ చేయాలి.
పూత పెంకు పురుగు నివారణకు…
ఎర్రని లేదా నారింజ రంగు మచ్చలు, నల్లని గీతలున్న పెంకు పురుగులు కంది పంటను పూత దశలో ఆశించి మొగ్గలను తినేస్తాయి. దాంతో దిగుబడి తగ్గిపోతుంది. పురుగులను గమనించిన వెంటనే ఉదయం పూట వాటిని ఏరి మంటలో కాల్చివేయాలి.
మారుక మచ్చల పురుగు…
పురుగు లార్వాలు ఆకులు, పూలు, కాయలను కలిపి గూడులా చేసుకొని తినేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2.5మిల్లీ లీటర్ల క్లోరో పైరిఫాస్, ఒక మిల్లీ లీటర్ డైక్లోరోవాస్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 3 మిల్లీ లీటర్ల స్పైనోసాడ్ 10లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకుచుట్టు పురుగు..
సాధారణంగా పంట పెరిగే దశలో ఆశించి నష్టపరుస్తుంది. కొన్ని సమయాల్లో పూత దశలోనూ దీని ప్రభావం ఉంటుంది. లద్దెపురుగు పూత దశలో పూతను గూడులా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యే సమయంలో మొగ్గలను దగ్గరగా చేర్చి గూడు కట్టుకుంటుంది. కాయలకు రంధ్రంచేసి లోపలి గింజలు తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం జరుగుతుంది. విత్తనం మొలకెత్తేదశలో ఈ పురుగు ఆశిస్తే మొత్తం పంటకాలం దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. తద్వారా పంట తీవ్రంగా నష్టపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ ఫాస్ 2 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పూత దశలో పిచికారీ చేయాలి.
పంట కోత నిల్వ…
కాయలు ఎండిన తరువాత మాత్రమే పంటను కోయాలి. పూత రెండు నెలల వరకు వస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కర్రతో కొట్టి కాయల నుంచి గింజలను వేరు చేయాలి. కందులను బూడిద లేదా వేప ఆకులు కలిపి నిల్వ చేసుకోవాలి. పురుగు ఆశించకుండా ముందుగా బాగా ఎండబెట్టాలి.