జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు కష్ట పడుతున్న సమయంలోనే అతడిని గాయం దెబ్బతీసింది. భవిష్యత్తు కెప్టెన్ అనిపించుకున్న శ్రేయస్కు ఒక దశలో జట్టులో చోటే గగనమైంది. అటు ఐపీఎల్లోనూ కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం ఇక ఆ స్థాయిలో ఆడటం కష్టమే అనుకుంటున్న స్థితిలో.. అనుమానాలను పటాపంచలు చేస్తూ శ్రేయస్ విజృంభిస్తున్నాడు. అరంగేట్ర టెస్టులో శతక్కొట్టిన ఈ బొంబై బుల్లోడు.. తాజా టీ20 సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధమంటున్న శ్రేయస్.. జట్టులో స్థానం, తన బ్యాటింగ్ గురించి చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే..
ధర్మశాల: టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. పోటీ విపరీతంగా ఉంటుంది. ప్రతి ఆటగాడు ఒంటిచెత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఉన్నవాళ్లే. ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నా. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడమే నా చేతిలో ఉంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ ఇష్టం. ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగినా.. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చితే వచ్చే ఆనందమే వేరు. ఇన్నింగ్స్ చివరి వరకు కొనసాగడం ఎంతో బాధ్యతతో కూడుకున్నది. దాన్ని నిర్వర్తించగలిగినప్పుడే పరిపక్వత వస్తుంది.
పొట్టి ఫార్మాట్లో తొలి మూడు స్థానాల్లో బరిలోకి దిగిన ఆటగాళ్లే జయాపజయాలను నిర్ణయిస్తారని నేను నమ్ముతా. టీ20ల్లో కుదురుకునేందుకు పెద్దగా సమయం ఉండదు. మిడిలార్డర్లో దిగితే సరిపడ బంతులు అందుబాటులో ఉండవు. నా వరకైతే మూడో స్థానంలో బరిలోకి దిగడాన్ని ఇష్టపడతా.
వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోవడమే నా చేతిలో ఉంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం జట్టులో పోటీ ఎక్కువగా ఉంది. జట్టు కూర్పు రీత్యా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా.
ప్రస్తుతం ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా. మూడు మ్యాచ్ల్లోనూ అర్ధశతకాలు సాధించడం ఆనందంగా ఉంది. అదీ కాక మూడింట్లోనూ అజేయంగా నిలువడం ఇంకాస్త స్పెషల్. కాస్త విరామం తీసుకుంటా. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ.. వర్తమానాన్ని వృథా చేసుకునే వ్యక్తిని కాదు. చివరి రెండు మ్యాచ్ల్లో ఆరంభం నుంచే వేగంగా ఆడాను.