సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సర్వత్రా హర్షాతిరేకాలు
వ్యక్తమవుతున్నాయి. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆత్మగల్ల సర్కారు ప్రవేశపెట్టిన పద్దులో ఉమ్మడి నల్లగొండలోని పలు కీలక ప్రాజెక్టులపై స్పష్టత లభించింది. రాష్ర్టానికే తలమానికంగా నిర్మిస్తున్న యాదాద్రి ప్రధానాలయం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. స్వరాష్ట్రంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలను ప్రారంభించగా, యాదాద్రిలోనూ 2023లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా థర్మల్ మెగా పవర్ ప్లాంట్ను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సుమారు 3.41లక్షల ఎకరాలకు సాగు నీరందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాల ఆయకట్టు గల పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సైతం ఈ సంవత్సరం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గతేడాది సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించారు. మరింత మందికి దళితబంధు, మన ఊరు-మనబడికి నిధులు, సొంతింటి నిర్మాణానికి ఆర్థిక సాయం, 57ఏండ్లకే ఆసరా పింఛన్, రైతు రుణమాఫీ, రోగులకు పౌష్టికాహారం, నేతన్నలకు బీమా, తండాలకు ప్రత్యేక నిధులు, బాలికలకు హైజనిక్ కిట్లు వంటివి సర్కారు చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు సైతం స్వాగతిస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రెండు కండ్లుగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్న చర్చ సర్వత్రా వినిపించింది. ఇప్పటికే దేశంలోనే అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ర్టానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిచ్చి అగ్రగామిగా నిలిచేలా తోడ్పడుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి నల్లగొండకు ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమపరంగా మంచి ప్రాధాన్యం లభించినట్లుగా భావిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి, ఆధ్మాత్యిక, విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో ఉమ్మడి జిల్లాకు బడ్జెట్లో కేటాయింపులు ఉండడంపైవివిధ వర్గాల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకెల్లా మేటిది తెలంగాణ బడ్జెట్… రాష్ట్రంలో సంపదను పెంచుతూ పేదలకు పంచేది ఇది.. సీఎం కేసీఆర్ దార్శనికతకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది.. గతంలో మాదిరి ఈ సారి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరం. ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్న పనులన్నీ ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి కానున్నాయి. రాష్ర్టానికే ఉమ్మడి నల్లగొండ జిల్లా రోల్ మోడల్గా మారనుంది. ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి దేవాలయం, యాదాద్రి పవర్ ప్లాంట్, డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాలతోపాటు నాగార్జునసాగర్పై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయి వాటి ఫలాలు ప్రజలకు దక్కుతాయి. మొత్తంగా ఇది పేదల బడ్జెట్. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపించిన బడ్జెట్ అంటూ ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు.
–
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాలకు అనుకూలమైనది. తెలంగాణ వచ్చిన అనతి కాలంలోనే 2.50లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే స్థాయికి వచ్చిందంటే రాష్ట్ర ఆదాయం ఏ రీతిన పెంచారో అర్థమవుతుంది. వ్యవసాయం, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రతి నియోజకవర్గానికీ 3వేల చొప్పున కేటాయింపులు చేయడం, సొంత ప్లాటు ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాలకు బాగా కేటాయింపులతోపాటు ఆరోగ్యశ్రీని రెండు నుంచి ఐదు లక్షలకు పెంపు పట్ల పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్యం మరింత చేరువ కానుంది.
-బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభ సభ్యుడు
గతంలో నేను నా భర్త కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకోలేక ఇబ్బందులు పడేవాళ్లం. దళిత బంధు కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.10లక్షలతో ఒత్తుల మిషన్, బర్రెలు తీసుకున్నాం. దాంతోపాటు భూమిని చదును చేసుకొని బోరు వేసుకోవడంతో మా ఇద్దరికి చేతినిండా పని దొరికింది. దళిత బంధు పథకం మా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– బొల్లారం లావణ్య, దళిత బంధు లబ్ధిదారు, వాసాలమర్రి, తుర్కపల్లి మండలం
యాదాద్రి భువనగిరి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. గత ప్రభుత్వాల పాలనలో ఏనాడూ విద్యాభివృద్ధి కోసం పాటుపడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతం వెళ్లి చదువుకోలేని విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– దేవరపల్లి ప్రవీణ్రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ ఆత్మకూరు(ఎం)
వాసాలమర్రి నుంచే దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా అమలైంది. ఇప్పటివరకు వాసాలమర్రిలో 76 కుటుంబాలకు, నియోజక వర్గానికి 100 చొప్పున 1200 కుటుంబాలు, తిరుమలగిరి మండలంలో మరో సుమారు 500 కుటుంబాలకు ఇప్పటికే దళితబంధు పథకానికి ఎంపిక చేశారు. ఈ ఏడాది మరో 24వేల మంది వరకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నారు. దీంతో దళితుల జీవితాల్లో ఆర్థికంగా సమూల మార్పులు వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దశలవారీగా అన్ని కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు.
మన ఊరు – మన బడికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమినిస్తున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లగొండ జిల్లాలో 517, సూర్యాపేటలో 329, యాదాద్రిలో 251 మొత్తం 1097 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలివిడుతలో ఈ పాఠశాలన్నింటినీ సమూలంగా మార్చాలని, అన్ని రకాల వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ప్రకటించారు.
నల్లగొండ, మార్చి 7 : బడ్జెట్లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించడాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రూ.7,289 కోట్లు, మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించడం, మహిళా, ఫారెస్ట్ యూనివర్సీటీల స్థాపనకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేశ్ యాదవ్, నాయకులు నడ్డి వెంకన్న, శివ ముదిరాజ్, మహేశ్ చారి, నాగరాజు, బాష, గణేశ్నాయక్, శిల్ప, రేణుక, సంధ్య, స్నేహలత, అనూష, స్వాతి, స్వప్న పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏడు నుంచి ఇంటర్ చదివే బాలికలకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 70వేల మందికి పైగా బాలికలకు ప్రయోజనం కలుగనున్నట్లు అంచనా. దీనిపై విద్యాశాఖ నుంచి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.
కార్మిక సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోనే ఎక్కడా లేని విధంగా వివిధ రంగాల్లోని కార్మికులు, సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారు. మత్య్స, గీత, గొల్లకుర్మల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ కార్మికులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి దశలో రాష్ట్రంలో లక్ష మంది కార్మికులకు మోపెడ్లు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో భవననిర్మాణ రంగంలో సుమారు 2లక్షల మందికి పైగా పనిచేస్తున్నట్లు అంచనా. ఇందులో తొలిదఫాలో కొందరికీ మోపెడ్లు అందనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో సుమారు 80వేల మందికి 50వేల రుణమాఫీ ద్వారా ప్రయోజనం జరుగనుంది. నల్లగొండ జిల్లాలో 37వేలు, సూర్యాపేటలో 27వేల మంది, యాదాద్రిలో జిల్లాలో 16వేల మంది పైచిలుకు రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక 75వేల వరకు రుణమాఫీలోనూ మరో 50వేల మందికి ప్రయోజనం కలుగవచ్చని భావిస్తున్నారు. దీనిపై బ్యాంకర్ల ద్వారా మరింత స్పష్టత రానుంది.
ఇవి కాకుండా జిల్లాలో ఇప్పటికే రైతుబంధు ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక ప్రయోజనం జరుగుతుంది. రైతు బీమాతో ఆర్థికంగా భరోసా పొందిన కుటుంబాలు కూడా జిల్లాలోనే ఎక్కువ. పల్లెప్రగతిలోనూ జిల్లాలోని మొత్తం 1740 పంచాయతీలకు ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు సమకూరాయి. దీంతో పల్లెల వాతావరణమే మారిపోయింది. ఇక కేసీఆర్ కిట్స్ ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 17వేల మంది బాలింతలకు ప్రయోజనం చేకూరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏ రంగంలో చూసినా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న కాలంలో మిగిలిన ప్రాజెక్టులు, యాదాద్రి ఆలయం, థర్మల్ పవర్ ప్రాజెక్టు, రీజినల్ రింగ్రోడ్డు లాంటివి పూర్తయితే ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలువనుంది. దీంతోపాటు సంక్షేమ పథకాల పరంగా అత్యధిక ప్రయోజనం పొందుతున్న జిల్లాగానూ ప్రముఖంగా నిలువనుంది. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్పై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారుల లెక్కల ప్రకారం అన్ని అస్పత్రుల్లో కలిపి మొత్తం 1592 బెడ్స్ ఉన్నాయి. వీటిల్లో టీబీ, క్యాన్సర్ పేషెంట్లకు ప్రస్తుతం 56రూపాయలు చెల్లిస్తుండగా దాన్ని రెట్టింపు చేశారు. సాధారణ రోగుల డైట్ చార్జీలను రూ.40 నుంచి 80కి పెంచారు. దీంతోపాటు ఒక్కో బెడ్ పారిశుధ్య నిర్వహణకు ప్రస్తుతం రూ.5వేలు ఇస్తుండగా దాన్ని 7500రూ.లకు పెంచారు. దీని ద్వారా ఏడాది పొడవునా 1592 బెడ్లకు అదనపు సౌకర్యాలు రానున్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే కేసీఆర్ కిట్స్, డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా అత్యధిక లబ్ధి పొందుతున్న జిల్లాగా నల్లగొండనే ఉంది.