CM KCR | పొలిటికల్గా మేం పోలేం. పొలిటికల్ పరిభాష మాకు రాదు. మేం జెప్పేదాంట్లో సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ పొలిటికల్ భాషగా మల్చాలి. కనుక ఒక అవుట్ లెట్ దొరికింది. ఇంతకు ముందు చెన్నారెడ్డి, అందరికి జేసిన గాని ఈయనలో ఉన్న ప్రత్యేకత నాకెక్కడ గూడ కనబడ లేదు. కనుక ఏందంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక సాధనం తెలంగాణ భావజాల వ్యాప్తికి. రాజకీయ ప్రక్రియ ద్వారా తేవాలనుకున్నడు. ఆయన ఇదే అన్నడు.
‘సార్ మీరెంతో కష్టపడ్డారు, లైఫంతా కష్టపడ్డారు. పొలిటికల్ ప్రాసెస్ లేంది కాదిది. పొలిటికల్ ప్రాసెస్ కావాల్సిందే మరి. ఇట్స్ ఏ ఫ్యాక్ట్’ అని చెప్పిండు. ఆయనలో తెలంగాణ సమస్య గురించి అర్థం జేసుకొనే ఆ పట్టుదల, తపన, ఆర్టిక్యులేషన్ అంటే విశ్లేషణ నన్ను చాలా ఇంప్రెస్ జేసినయ్. వీటిని ఇంకెవరిలో జూడలె నేను, అంటే ఆ స్థాయిలో పొలిటికల్ ప్రాసెస్ అంటే పట్టించుకోలె, ఎందుకు పట్టించుకోలె అంటే పొలిటికల్ ప్రాసెస్ అనేది వేరు విషయం. ఇది లేంది అది లేదు. అది లేంది ఇది లేదు. అది నాతోగాదు కనుక ఆ ప్రాసెస్లో రిఫైన్ జేయడానికి ఈయన నాకు ఉపయోగపడతాడనే దాంతోటి ఆయనతోటి అసోసియేట్ అయిన.
-ప్రొఫెసర్ జయశంకర్
జయశంకర్ సార్ మరణంతో కన్నీరుమున్నీరైన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ బయలుదేరినప్పటి నుంచి పుష్కరకాలం ఉద్యమానికి అటు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఇటు ఉద్యమనేత కేసీఆర్ రెండు కాళ్లలా కలియదిరిగారు. జయశంకర్ సార్ పది మంది గుమిగూడినప్పుడు ఏ ఆర్తితో తెలంగాణ వాదాన్ని వినిపించారో.. 25 లక్షల మందితో 2010, డిసెంబర్ 16వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ మహాగర్జనలోనూ అంతే ఆర్తిని ఆవిష్కరించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా స్థిరపడిన జయశంకర్ సార్ జూన్ 21, 2011లో మరణించారు.
తెలంగాణ ఒక్కసారిగా తల్లడిల్లింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో తన వేలుపట్టి నడిపించిన జయశంకర్ సార్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు. జయశంకర్ అంతిమసంస్కార యాత్ర తెలంగాణ లాంగ్మార్చ్ తలపించింది. హనుమకొండ ఏకశిలా పార్కు నుంచి పద్మాక్షిగుట్ట దగ్గరికి జయశంకర్ సార్ అంతిమయాత్రను ఆసాంతం కేసీఆర్ నడిపించారు. జయశంకర్ సార్ పార్థివదేహాన్ని చితిలో పెట్టేముందు కడసారి చూసిన కేసీఆర్ను ఆపటం ఎవరితరం కాలేదంటే అతిశయోక్తి కాదు.