ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 19 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఓయూ పూర్వ డీన్ ఆఫ్ సైన్సెస్ ఆచార్య వీఎల్ఎస్ భీమశంకరం (90) శుక్రవారం కన్నుమూశారు. ఓయూ లో భూ విజ్ఞాన శాఖను ప్రారంభించి దానికి మొట్టమొదటి శాఖాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయనది. 1987-89 మధ్య ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించారు. నోబెల్ బహుమతి గ్రహీత బ్లాకెట్తో కలిసి ఆయన పలు పరిశోధనల్లో పాలు పంచుకున్నారు. 1994-96 మధ్య యూజీసీ ఎమెటరీస్ ఫెలోగా సేవలందించారు. పదవీ విరమణాంతరం భీమశంకరం ప్రౌఢ పద్య కవిగా అనేక పద్య కృతులను రచించి సాహితీ సేవలందించారు. వీఎల్ఎస్ విజ్ఞాన సారస్వత పీఠం నెలకొల్పి ఎంతో మంది సాహితీమూర్తులను సన్మానించారు. ఆయన మృతికి పలువురు శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు అశ్రునివాళులర్పించారు.