వర్షాలు ఎలా కురుస్తాయి? ‘సముద్రంలోని నీరు ఎండకు ఆవిరై, మేఘాలుగా మారుతుంది! చల్లగాలి తగిలినప్పుడు ఆ మేఘాలు వర్షిస్తాయి’ అని పాఠశాల స్థాయిలో చదువుకున్నాం. ఈ పాఠంలోని విజ్ఞానం ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్నారని, మన ప్రాచీనులకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చని మనలో చాలామంది భావన. కానీ, అత్యంత ప్రాచీనం అని చెప్పే రుగ్వేదంలో వర్షం కథ సవిస్తరంగా కనిపిస్తుంది. దానికి కొనసాగింపుగా వర్షం ఎలా కురుస్తుందో తెలిపే కథలు మిగిలిన వేదాలు, పురాణాల్లోనూ కనిపిస్తాయి. మన ప్రాచీనుల గొప్పదనాన్ని, వర్షాన్ని వాళ్లు అంచనా వేసిన వైనాన్ని ఈ వేద కథ సుస్పష్టం చేస్తుంది.
పూర్వం వృత్రాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను భూమి మీద ఉన్న జలాశయాలన్నిటిలోని నీటిని కడుపు నిండా తాగేసి ఆకాశంలోకి వెళ్లి కూర్చునేవాడు. దీంతో భూమి మీద ప్రజలు నీళ్లు లేక బాధపడసాగారు. అందరూ ఇంద్రుడిని ప్రార్థించారు. జీవులను రక్షించడానికి దేవతలందరితో కలిసి ఇంద్రుడు, వృత్రాసురుడి పైకి యుద్ధానికి వెళ్తాడు. అసురుడి ధాటికి దేవతలు తట్టుకోలేకపోయారు. శ్రీహరిని శరణుకోరాడు ఇంద్రుడు. మహావిష్ణువు ఇంద్రుడి వజ్రాయుధంలోకి ప్రవేశించాడు. దానిని వృత్రుడిపైకి ప్రయోగించాడు సురరాజు. వజ్రాయుధం దేదీప్యమైన కాంతులు విరజిమ్ముతూ, పెద్ద శబ్దాలు చేస్తూ వెళ్లి వృత్రుడి పొట్టను చీల్చింది. అందులోని నీరంతా భువిపై వర్షించింది. నదులు పరవళ్లు తొక్కాయి. చెరువులు మత్తళ్లు దూకాయి. ప్రజలంతా ఆనందంతో పొంగిపోయారు. ఇదీ వృత్రాసుర కథ.
వృత్రుడు అంటే నల్లని కారు మేఘం. కారు మేఘాలనే వృత్రాసురుడిగా అభివర్ణించారు. వేసవిలో జలాశయాలలోని నీరు ఎండకు ఆవిరిగా మారి, ఆకాశంలో మేఘాలుగా ఏర్పడతాయి కదా! అదే జలమంతటినీ వృత్రుడు తాగేసి ఆకాశంలో కూర్చోవడంగా పేర్కొన్నారు. భూమి మీద నీరు తగ్గిపోవడంతో పంటలకు, నిత్యావసరాలకు నీరు లేక ప్రజలు దేవుళ్లకు పూజలు, యజ్ఞాలు చేసేవారు. వర్షాలను కురిపించే దేవుడుగా ఇంద్రుడిని పూజిస్తారు.
ఇంద్రుడు, దేవతలు కలసి యుద్ధానికి వెళ్లడంతో కారుమేఘాలు కమ్ముకుంటాయి. దట్టంగా మేఘాలు ఏర్పడినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కాంతిహీనంగా కనిపిస్తాయి. ఒక్కోసారి నక్షత్రాలు మొత్తంగా కనిపించవు. అంటే వృత్రుడు విజృంభించడంతో దేవతలు కళాహీనులు (పారిపోయారు) అయ్యారని అంతరార్థం. అప్పుడు ఇంద్రుడు ‘మరుత్తులు’ అనే దేవతల సాయంతో వృత్రాసురుడిపై మళ్లీ యుద్ధానికి వెళాడు. ‘మరుత్తులు’ అంటే చల్లని పిల్లగాలులు. అలా చల్లగాలులు వీచగానే మెరుపులు, ఉరుములు, పిడుగులు మొదలవుతాయి. వజ్రాయుధం అంటే పిడుగు. ఆ ఆయుధ కాంతులే మెరుపులు. వజ్రాయుధ భీషణ ధ్వని ఉరుములు. పిడుగు పడితే ఏదైనా ధ్వంసమే! వజ్రాయుధానికి ఎదురులేదు అంటాయి పురాణాలు. ఈ సృష్టిలో సర్వశక్తులకు అధిపతి విష్ణువే కదా! వజ్రాయుధ శక్తి ఆయనే!! ఆ విధంగా మెరుపులు, ఉరుములు, పిడుగులతోపాటు వర్షం కురుస్తుంది. వృత్రుడి పొట్ట చిరిగి జలమంతా కారిపోవడంలో అర్థం ఇదే. వర్షం తగ్గడంతో క్రమంగా మేఘాలు తొలగిపోయి నక్షత్రాలు మళ్లీ ప్రకాశిస్తాయి. అంటే వృత్రుడి మరణంతో దేవతలు తిరిగి వచ్చారని అర్థం. ఇంతటి చక్కటి ఉపమానంతో ఒక అందమైన కథగా మనకు అందించారు మన రుషీశ్వరులు.
(పురాణ గాథల్లో సైన్సు అద్భుతాలు గ్రంథం నుంచి..)
– పోలిశెట్టి బ్రదర్స్, 86399 38297