తిరువనంతపురం: కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజ, కరోనా ప్రారంభంలో పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకురాలు వీణా ఎస్ నాయర్ ఆరోపించారు. 2020లో మార్కెట్లో రూ.500 ధర ఉన్న పీపీఈ కిట్ను రూ.1,550 చొప్పున కొనుగోలు చేశారని, దీనికి గాను ఆమెకు ముడుపులు అందాయని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త దీనిపై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న హాజరుకావాలంటూ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు సమన్లు జారీ చేసింది.
కాగా, నాడు ఆరోగ్య మంత్రిగా ఉన్న కేకే శైలజ, ఎక్కువ ధరకు పీపీఈ కిట్లు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభ రోజుల్లో కొరత ఉన్నందున ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలకు ప్రాముఖ్యత నేపథ్యంలో నాణ్యతను నిర్ధారించిన తర్వాత ఎక్కువ ధర ఉన్న పీపీఈ కిట్ల కొనుగోలుకు సీఎం ఆమోదం తెలిపారని ఆమె వెల్లడించారు.