చండీగఢ్, ఫిబ్రవరి 16: ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్లోకి ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ భయ్యాలను (సోదరులను) రానివ్వొద్దంటూ ప్రజలను కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ పంజాబీల కోడలని అభివర్ణించారు. చన్నీ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో ప్రియాంక ఆయన పక్కనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వ్యక్తులను, కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకొని ఇలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నా’ అన్నారు. యూపీ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రియాంక తనకు తానుగా యూపీ బిడ్డగా చెప్పుకొంటారని, అయితే, పంజాబ్లో యూపీ, బీహార్ పౌరులు అవమానానికి గురైతే ఆమె చప్పట్లు కొడుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య మండిపడ్డారు. ఆమె రెండు నాల్కల ధోరణికి ఇదే తార్కాణమన్నారు.