కోల్కతా: సీబీఐ డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర సింగ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్ బిశ్వాస్లపై తృణమూల్ కాంగ్రెస్ బుధవారం సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్ కేసులో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను స్పీకర్ అనుమతి లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందని, ఈ ముగ్గురిపై ఈడీ కూడా చార్జిషీట్ ఫైల్ చేసిందని పేర్కొన్నది. ఎమ్మెల్యేల అరెస్టుపై దర్యాప్తు సంస్థలు స్పీకర్కు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపింది. ఇది స్పీకర్ స్థానాన్ని అవమానించడమేనని, సభా హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నది. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎంసీ మంత్రి తాపస్రాయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ బిమన్ బెనర్జీ ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి అప్పగించారు. దర్యాప్తు నివేదికను వచ్చే సెషన్లో సమర్పించాలన్నారు. టీఎంసీ ఎమ్మెల్యేలు ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను ఈ ఏడాది మొదట్లో సీబీఐ అరెస్టు చేసింది.