హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. ఈసారి సరికొత్త అస్త్రంతో యాజమాన్యాలు ముందుకురానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో అన్నిరకాల ప్రవేశ పరీక్షలను బహిష్కరించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ల నుంచి వైదొలగనున్నాయి. తమ కాలేజీల్లోని సీట్లను తామే సొంతంగా నింపుకోవాలన్న ఆలోచనలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఎప్సెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారా సర్కారే ఈ కాలేజీల్లోని సీట్లను భర్తీచేస్తున్నది. అయితే కన్వీనర్ కోటాలో భర్తీచేసిన సీట్లకు సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలేదు. బకాయిలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. ఈ బకాయిలు రూ. 10వేల కోట్లు ఉంటాయని యాజమాన్యాలు అంటున్నాయి. రెండుసార్లు యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. అయితే బకాయిలు విడుదలకాకపోవడం, సర్కార్ నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి)గా ఏర్పడ్డాయి. తొలుత సెప్టెంబర్ 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. వీరితో చర్చలు జరిపిన సర్కార్ రూ. 1,200 కోట్లు ఇస్తామని చెప్పి.. అక్టోబర్ 1న రూ. 200 కోట్లు విడుదల చేసింది. దసరాకు ముందు కాలేజీలు మళ్లీ బంద్కు పిలుపునిచ్చాయి. అధ్యాపకులు, విద్యార్థులతో ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామన్నాయి. ఈ క్రమంలో సీఎం రంగంలోకి దిగి బెదిరింపులకు దిగారు. కాలేజీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతో యాజమాన్యాలు బంద్ సహా ఆందోళనపై వెనక్కి తగ్గాయి. తాజాగా మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలకాకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రముఖ కాలేజీలు సైతం అవస్థలు పడుతున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో కాలేజీ యాజమాన్యాల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు సేకరించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఫీజు బకాయిలు విడుదలయ్యే వరకు పోరాటం సాగుతుంది.