హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థకు కార్మికుల ప్రాణాలే ముఖ్యమని, రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ సీఎండీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గనులన్నింటిలో ఖర్చులకు వెనుకాడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణిభవన్ నుంచి డైరెక్టర్లు, అడ్వయిజర్లు, అన్ని ఏరియాల మేనేజర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలే సంస్థకు ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
రక్షణ పరికరాల కొనుగోలుతోపాటు కార్మికులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. చిన్న, పెద్ద ఉద్యోగులన్న తేడాల్లేకుండా రక్షణ చర్యలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నవంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తి, రవాణాపైనా సీఎండీ సమీక్షించారు. సమీక్షలో డైరెక్టర్లు కే చంద్రశేఖర్, ఎన్ బలరాం, డీఎన్ ప్రసాద్, సలహాదారు కే సురేంద్రపాండే, ఈడీ కోల్ మూమెంట్ జే అల్విన్, జీఎంలు సూర్యనారాయణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.