న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ ముప్పును దృష్టిలో పెట్టుకొని రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ముందుస్తుగా బుక్ చేసుకోని వారికి సైతం విమానంలోకి ఎక్కేందుకు అనుమతించనున్నారు. అయితే, అలాంటి ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ముందస్తుగా స్లాట్ బుక్ చేయడం సంబంధిత విమానయాన సంస్థలదే బాధ్యతని స్పష్టం చేసింది.
ఇప్పటికే యూకే ఇలాంటి మార్గదర్శకాలను అమలు చేస్తున్నది. ఈ నిబంధనతో దేశానికి వచ్చే ప్రయాణికులంతా ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండగా.. నిబంధనలు పాటించడంలో విఫలమైతే బ్రిటీష్ విమానాశ్రయానికి విమానంలో ఎక్కేందుకు అనుమతించడం లేదు. ఈ నిబంధనలు భారత్లో ఈ నెల 20 నుంచి అమలులోకి రానున్నది. తొలి దశలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోని విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తించనున్నది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోలో ప్రయాణికులు ‘రిస్క్లో ఉన్న’ దేశాల నుంచి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేసుకునేందుకు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు అనుమతించేలా ఎయిర్ సువిధ పోర్టల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపింది. ముందస్తు బుకింగ్, చెల్లింపుల మొదలైన దాంట్లో ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు మొదట ఆరు నగరాల్లో అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రిస్క్ దేశాల జాబితాల్లో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, యూకే సహా యూరిపియన్ దేశాలున్నాయి. ఇదిలా ఉండగా విమానం ఎక్కే ముందు తమ ప్రయాణికులు తప్పనిసరిగా ముందస్తు బుకింగ్ను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది.