అబద్ధాల పునాదులపై అద్దాల మేడలను నిర్మించడం ప్రధాని నరేంద్రమోదీకి కొత్తేంకాదు. దేశభక్తి ఉరకలెత్తే పండుగల సమయాల్లోనైతే.. మాటలతో కోటలు కట్టి.. అరచేతిలోనే స్వర్గం చూపించి.. తాను కోరుకొన్నది సాధించుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చారిత్రాత్మక ఎర్రకోట సాక్షిగా ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆయన ఇస్తున్న హామీలు.. అవి అమలవుతున్న తీరును విశ్లేషిస్తే, అసలు విషయం ఏమిటో బోధపడుతుంది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోదీ.. ఇప్పటివరకూ పదిసార్లు ఎర్రకోట వేదికగా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. పదిసార్లు అక్కడి నుంచి జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఏటా పంద్రాగస్టు నాడు ఏదో ఓ నినాదాన్ని లేక పలు హామీలను ఇవ్వడం ఆయనకు అలవాటు. ఏడాది వ్యవధిలో వాటిని అమలు చేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయడం కూడా పరిపాటే. అయితే, గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో మోదీ ఇచ్చిన నినాదాలు, హామీలు ఇప్పటికీ సాకారం కాలేదు.
దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి మరో ఉద్యమాన్ని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. అప్పుడే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. అయితే, ఇప్పటికీ దేశంలో 40 కోట్లమందికి పైగా పేదరికంలోనే జీవనం సాగిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక, భారత్లో ఉత్పత్తిని పెంచడానికి ‘మేకిన్ ఇండియా’ అంటూ మరో నినాదం ఇచ్చారు. అయితే స్వదేశీ పరిశ్రమలను ఆదుకోవడాన్ని మరిచిపోయారు. గాంధీజీ 150వ జయంతి అయిన 2019 అక్టోబర్ 2 నాటికి పరిశుభ్ర భారతాన్ని సృష్టిస్తామని గప్పాలకు పోయారు. అయితే, ‘స్వచ్ఛభారత్’ కోసం వేలకోట్ల నిధులను కేటాయించినప్పటికీ, పరిశుభ్ర భారతం సాకారంకాలేదు. ‘జన్ధన్ ఖాతా’ల ద్వారా ప్రతీఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండేలా చేస్తామన్నారు. దేశంలో ఇప్పటికీ 21 కోట్లమందికి బ్యాంకు ఖాతా లేదు.
అప్పటికే పిలుపునిచ్చిన స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాకు తోడుగా స్టార్టప్ఇండియా-స్టాండప్ ఇండియా అంటూ మోదీ మరో నినాదాన్నిచ్చారు. స్టార్టప్ కంపెనీలకు నిధులు సమకూర్చడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో 49 శాతం స్టార్టప్ కంపెనీలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటూ మూసివేసే దశలోకి చేరాయి. నల్లధనంపై పోరు చేస్తామని మోదీ ప్రకటించారు. ప్రతీఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామన్నారు. అదీ సాకారం కాలేదు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడులు తగ్గాయని మోదీ అన్నారు. అయితే పుల్వామా, గల్వాన్ ఘటనలో మన జవాన్లు అమరులవ్వడం తెలిసిందే. పేదలకు వైద్యం భారం కాకుండా ఏడాదికి రూ. లక్ష ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో తాము ఎన్నో లొసుగులు గుర్తించామని కాగ్ ఇటీవలి నివేదికలో వెల్లడించింది.
ఏండ్లతరబడి ప్రజల సొమ్మును దోచుకొన్నవారికి మనశ్శాంతి లేకుండా చేస్తామని మోదీ ఊదరగొట్టారు. అయితే, బ్యాంకులకు వేల కోట్లు ఎగనామంపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలాంటి మోసగాళ్లు మోదీ హయాంలోనే విదేశాలకు పారిపోయారు. బ్యాంకుల నుంచి కార్పొరేట్లు తీసుకొన్న రూ. 15 లక్షల కోట్ల రుణాలను కేంద్రం రైటాఫ్ చేసింది.
జీఎస్టీ వంటి సంస్కరణలతో భారత్ పరుగుపెడుతున్నదని మోదీ ఊదరగొట్టారు. అయితే జీఎస్టీ దెబ్బతోపాటు కరోనా సంక్షోభం, కేంద్రప్రభుత్వ ప్రోత్సాహకలేమితో గడిచిన తొమ్మిదిన్నరేండ్ల వ్యవధిలో దాదాపు 10 లక్షల చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతబడ్డాయి. 2019లో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రిపోర్డ్ కార్డ్ చదివి వినిపించారు. దేశం బహిరంగ మలమూత్ర విసర్జనరహితంగా మారిందన్నారు. అయితే, ఢిల్లీలో ప్రధాని అధికార నివాసానికి కూతవేటు దూరంలోనే కొందరు పేదలు మరుగుదొడ్లు లేకపోవడంతో చెట్లచాటున బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నారు. అన్నిగ్రామాలకు కరెంటు సౌకర్యం కల్పించామన్నారు. 13 శాతం ఇండ్లకు ఇంకా కరెంటు లేదు.
ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామన్నారు. ఇప్పటికీ 50 శాతం ఇండ్లకు నల్లా కనెక్షన్ లేదు. 70 శాతం ఇండ్లకు సురక్షిత తాగునీరు అందట్లేదు. జమిలి ఎన్నికలతో మేలు జరుగుతుందని అన్నారు. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని ప్రభుత్వ సంస్థలే నివేదికల్లో వెల్లడించాయి. ద్వితీయశ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను తీసుకొస్తామన్నారు. అయితే, ‘ఉడాన్’ స్కీమ్లో 52 శాతం రూట్లలో ఇంకా సేవలు ప్రారంభమే కాలేదని ఇటీవల కాగ్ ఓ నివేదికలో తూర్పారబట్టింది.
కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు మోదీ. అయితే, రెండోవేవ్లో ఆక్సిజన్ అందక వందలాది మంది కరోనా రోగులు పిట్టల్లా రాలిపోయారు. చైనా విస్తరణవాదాన్ని తిప్పిగొట్టామన్నారు. అయితే, గల్వాన్ ఘటనలో 20 మంది జవాన్లు అమరులవ్వడమే కాదు.. సరిహద్దుల్లోని దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొన్నప్పటికీ ప్రధాని నోరు మెదపలేదు.
యువతకు ఉపాధి అవకాశాలతో పాటు, దేశం నలుమూలలా మౌలిక వసతుల కల్పనకు కోటి కోట్ల రూపాయలతో పీఎం గతిశక్తి స్కీంను తీసుకొస్తున్నట్టు మోదీ చెప్పారు. గతిశక్తి పథకాన్ని 2019, 2020లోనూ చూచాయగా ప్రస్తావించిన ప్రధాని.. ఈఏడాదిలో (2021) పూర్తిగా వివరించారు. అయితే, ఈ స్కీం అతీగతీ లేకుండా పోయింది. గతిశక్తిలో భాగంగా చేస్తున్న కొన్ని పనుల్లోనూ అవకతవకలు జరుగుతున్నట్టు కాగ్ నివేదించింది.
2022నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తానన్న ప్రధాని.. ఆ లక్ష్యాన్ని 2047కు మార్చారు. అభివృద్ధి చెందిన భారతే లక్ష్యమని, వలసవాద ఆలోచనలను తొలగించడం, మూలాల పట్ల గర్వపడటం, ఐక్యత, జవాబుదారీతనం పేరిట పంచ ప్రతిజ్ఞలను తీసుకొచ్చి అరచేతిలో స్వర్గం చూపించారు. అయితే, ఏదీ సాకారమయ్యే పరిస్థితి లేదు. ఇక ఈసారి స్వాతంత్య్ర దినోత్సవంనాడు మహోజ్వల నవభారత నిర్మాణానికి పునరంకితం అవుతామని 2014లో ఇచ్చిన హామీని మళ్లీ రిపీట్ చేశారు మోదీ.