సిద్దిపేట : సిద్దిపేటను మరో అవార్డు వరించింది. చిన్నారులకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడం లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులోజిల్లా సత్తా చాటింది. వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్లు వేసుకోలేని చిన్నారులను గుర్తించి, వారందరికి వ్యాక్సిన్లు పంపిణీ చేయడంలో అధికారులు, సిబ్బంది మంచి ఫలితాలు సాధించారు.
దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ ఇంద్ర ధనుష్’ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ -2019 కి ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 21న ఢిల్లీలో జరిగే ‘సివిల్ సర్వీసెస్ డే’ కార్యక్రమంలో ట్రోపీతో పాటు రు.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందిస్తుంది.
సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలోని ప్రతిచిన్నారికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు.