కాశీబుగ్గ, ఏప్రిల్ 19: ఆర్థిక ఇబ్బందులతో అర్చకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సార్ నగర్కు చెందిన మార్త ఓంప్రకాశ్ (38) కాశీబుగ్గలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయంలో అర్చకుడిగా పని చేశారు. ప్రస్తుతం మొగిలిచర్లలోని శివాలయంలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు.
వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఇంట్లో గొడవలయ్యేవి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.