BJP | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి విమర్శించారు. మత, కుల పరమైన చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నాడు అని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాణి రుద్రమదేవి మీడియాతో మాట్లాడారు.
భారతదేశంలో చిచ్చుపెట్టేందుకు టెర్రరిస్టుల తరహాలోనే రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి ఆయన రిజర్వేషన్లను రద్దు చేస్తామని అనని విషయాన్ని అన్నట్టు రేవంత్ రెడ్డి తన ప్రసంగాల ద్వారా, కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి తీవ్రవాదిలాగా దేశ ద్రోహానికి పాల్పడుతున్నాడు అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి కానీ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల్లో భయాందోళనలు సృష్టించి విద్వేషాలు రగుల్చుతున్నాడు. కాంగ్రెస్ అధికారిక ఎక్స్ అకౌంట్ అమిత్ షా, బండి సంజయ్ మాటలను వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహారిస్తున్నారు. రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ తరహాలో వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ను ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ గౌరవించిందా..? మంత్రి పదవికి బలవంతంగా అంబేద్కర్ చేత రాజీనామా చేయించి… ఆ తరువాత ఎన్నికల్లో నిలబడితే ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని రుద్రమదేవి గుర్తు చేశారు.
ఆరు గ్యారెంటీ లు అమలు చేయకుండా మీ బలహీనతలు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేస్తూ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిది టీడీపీ డీఎన్ఏ. గతంలో లాఠీలను పట్టుకుని పోలీసులను తరిమిన వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. అలాంటి వ్యక్తితో రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారు. బీసీల వాటా రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేందుకు పోరాటం చేస్తుంది బీజేపీ. ఇదే ఫేక్ ప్రచారంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మరోసారి అబద్ధాలు ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని రాణి రుద్రమదేవి మండిపడ్డారు.