ఇబ్రహీంపట్నం, మే 29 : హైదరాబాద్ నగరంలోని రాంనగర్ తరహాలో ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో ఫిష్మార్కెట్ నిర్మించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలోని మత్స్యకారులతో పాటు నగరంలోని చేపల విక్రయదారులు ఇక్కడ అమ్ముకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలని యోచించింది. అందుకోసం ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలోని చేపపిల్లల పెంపకం కేంద్రం వద్ద ఫిష్ మార్కెట్ నిర్మించాలని పూనుకొని రూ.2 కోట్ల నిధులను సైతం కేటాయించింది. మార్కెట్ పనులకు అప్పటి మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఫిష్మార్కెట్ పనులు అటకెక్కాయి.
రోడ్లపైనే అమ్మకాలు..
మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇబ్రహీంపట్నంతో పాటు తుర్కయాంజాల్, రాగన్నగూడ, బొంగ్లూర్, యాచారం, మాల్, తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే చేపలను విక్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. దీంతో ఇటు వ్యాపారులు, అటు వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున చెరువుల్లో చేపపిల్లల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నాలుగుకోట్ల పైచిలుకు చేపపిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆయా సొసైటీల పరిధిలోని చెరువుల్లో పెంపకానికి కేటాయించారు. పెంచిన చేపలను విక్రయించేందుకు ఒక మార్కెట్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని హంగులతో ఫిష్మార్కెట్ను నిర్మించి కొనుగోలుదారులు, అమ్మకందారులకు సౌకర్యాలు కల్పించాలని భావించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో ఫిష్ మార్కెట్ నిర్మాణం పెండింగ్లో పడింది. నిధులున్నా ఇప్పటికీ పనులను ప్రారంభించడంలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ స్పందించి ఇబ్రహీంపట్నంలో మార్కెట్ సౌకర్యాన్ని కల్పించాలని మత్స్యకారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు.
ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలి..
ఫిష్ మార్కెట్ పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలి. గత ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలో చేపల మార్కెట్తో పాటు ల్యాబ్ను ఏర్పాటుచేసేందుకు నిధులు కేటాయించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ నిర్మాణంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఈ ప్రాంతంలోని మత్స్యకారులమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా స్పందించి ఫిష్మార్కెట్తో పాటు ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయాలి.
-గుంటి భీంరావు, జిల్లా మత్స్య సహకార సంఘం నాయకులు
వెంటనే మార్కెట్ పనులను ప్రారంభించాలి..
గత ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసింది. ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయడంతోపాటు పెంపకానికి అవసరమైన సౌకర్యాలు కల్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవడంలేదు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చేపల మార్కెట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే చేపల మార్కెట్ పనులు ప్రారంభించాలి.
-గుంటి కిరణ్, మత్స్యకార సంఘం నాయకుడు