కొండాపూర్, డిసెంబర్ 8: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, చిన్నారుల వైద్యం కోసం హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో 6 వేల పడకలను సిద్ధం చేశామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. బుధవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో రహేజా కే కార్ప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.10 కోట్లతో ఏర్పాటుచేసిన 120 పడకలను విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ప్రభుత్వ విప్ అరెకెపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ చికిత్స కోసం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రూ.154 కోట్లతో 900 ఐసీయూ పడకలు సిద్ధం చేసినట్టు తెలిపారు. దవాఖానల్లోని ప్రతి పడకకు ఆక్సిజన్ను అందించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. డయాలసిస్ కేంద్రాలు, వెంటిలేటర్ల పెంపు, మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 30 శాతానికి మించకపోయేదని, కేసీఆర్ కిట్ల వల్ల 52 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
రోజుకు 4 లక్షల మందికి టీకాలు
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు కృషిచేయాలని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్రావు సూచించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినట్టే ప్రతి డివిజన్ కార్పొరేటర్ ఇంటింటికీ తిరుగుతూ టీకాలు వేయించాలని ఆదేశించారు. ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోజుకు 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్టు తెలిపారు.