మేడ్చల్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): త్వరలో ప్రారంభం కానున్న పల్లె దవాఖానలలో వైద్యుల నియామకాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తి చేశారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 35 పల్లె దవాఖానల్లో 35 మంది వైద్యులను నియమించినట్లు జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు వెల్లడించారు. పల్లె దవాఖానలో వైద్యుల నియామకంతోపాటు ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులను భర్తీ చేసి పల్లె దవాఖానల ప్రారంభానికి వైద్యశాఖ సర్వం సిద్ధం చేసింది. బస్తీ దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలు పల్లె ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానలను త్వరలో ప్రారంభించనుంది. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వైద్యాధికారి మల్లికార్జునరావు పేర్కొన్నారు.
త్వరలో పక్కా భవనాలు..
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న పల్లె దవాఖానలకు పక్కా భవనాలు నిర్మించనున్నారు. మొదటి దశలో భాగంగా 15 పల్లె దవాఖానలకు పక్కా భవనాలకు రూ.2కోట్ల 40లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్క పల్లె దవాఖానకు రూ.16లక్షల చొప్పున మంజూరు చేయడంతో భవన నిర్మాణాలకు టెం డర్లను ఆహ్వానించింది. టెండర్ల పక్రియ పూర్తయిన వెం టనే పనులను ప్రారంభించనున్నారు. మిగిలిన 20 పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు త్వరలోనే చర్య లు తీసుకోనున్నారు. పక్కాభవనాల నిర్మాణాల కోసం రెవెన్యూ అధికారులు స్థలాలను ఎంపిక చేస్తున్నారు.