న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కొవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. 18 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న వారందరికీ ఈ నెల 10 నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇవి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తయినవారు ప్రికాషన్ డోసుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 15 ఏండ్లు పైబడినవారిలో 83 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ను పొందారని, దాదాపు 96 శాతం మంది కనీసం ఒక్క డోసునైనా తీసుకొన్నారని తెలిపారు. వీటితోపాటు ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏండ్ల వయసు దాటినవారు 2.4 కోట్లకుపైగా ప్రికాషన్ డోసులను పొందారని, 12 నుంచి 14 ఏండ్లలోపు వారిలో దాదాపు 45 శాతం మంది తొలి డోసు తీసుకొన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.
కొవిషీల్డ్ టీకా ప్రికాషన్ డోసు ధరను రూ.600గా నిర్ణయించినట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అధర్ పూనావాలా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీకా వేసుకొనే ఎవరైనా రూ.600(పన్నులు అదనం) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన అందరూ ప్రికాషన్ డోసు వేసుకోవడానికి కేంద్రం అనుమతించడాన్ని ఆయన స్వాగతించారు.