ఢిల్లీ ,జూన్ 5: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహారత్న హోదా సంస్థ ‘పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (పవర్గ్రిడ్)రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ దీనిని ప్రారంభించారు. పారిశ్రామిక సామాజిక బాధ్యత కింద రూ.1.11 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంటును నిర్మించారు. రాజస్థాన్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.రఘు శర్మ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, పవర్గ్రిడ్ అధికారులు పాల్గొన్నారు.
ఈ ఆక్సిజన్ ప్లాంటు నిమిషానికి 850 లీ. ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. రాష్ట్రంలోని ప్రజారోగ్య మౌలిక సదుపాయాలకు ఇది మరింతగా దోహదపడుతుంది. జిల్లా ఆసుపత్రిలో ఉన్న 200 పడకల్లో 30 పడకలకు ఇప్పటివరకు ఆక్సిజన్ సదుపాయం ఉండగా, ఇప్పుడీ ప్లాంటు ఏర్పాటుతో మొత్తం 200 పడకలకు ఆక్సిజన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటైంది. దీనివల్ల, జైసల్మేర్ జిల్లా చుట్టుపక్కలున్న దాదాపు 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నది.