హైదరాబాద్ : ఈ నెల 27న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు కేఆర్ఎంబీ సభ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సమాచారం పంపినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 11 గంటలకు జలసౌధలో సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే, సమావేశం వాయిదాకు గల కారణాలు రాలేదు. ఇప్పటికే సమావేశంలో చర్చించేందుకు 14 అంశాలతో కేఆర్ఎంబీ ఎజెండా తయారు చేసింది. ఇదిలా ఉండగా.. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం సోమవారం మరోసారి లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో కోరింది. అలాగే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించేందుకు వెలిగొండ ప్రాజెక్టును చేపట్టిందని, ఈ అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.