Post Card | ఆదిలాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ)/రామారెడ్డి/భైంసా/పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎంవో కార్యాలయానికి సోమవారం అన్నదాతలు ఉత్తరాలు రాశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతులతో సమావేశమయ్యారు. వరి కి రూ.500 బోనస్, కౌలురైతుకు రైతుబంధు, రుణమాఫీ ఎప్పుడు అమలుచేస్తారంటూ రైతులు సీఎంవో కార్యాలయానికి ఉత్తరాలను పంపారు. ఆదిలాబాద్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు, రైతులు సీఎం రేవంత్రెడ్డికి లేఖలు పంపారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు భరోసా వంటి అంశాలను ఉత్తరాల్లో పేర్కొన్నట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన రైతు నర్సయ్య, నాగరాజు, పుండలిక్ సీఎంకు ఉత్తరాలు రాశారు. ‘అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చి మోసం చేసిన రేవంత్ సర్కారుపై పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించాం. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? అంటూ 5 వేల పోస్టులు సీఎంకు పంపాం. నేటి నుంచి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోని గ్రామ గ్రామాన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాం’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.