న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఈ అంశంపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిసోడియా గురించి సీబీఐకి కేజ్రీవాలే ఫిర్యాదు చేసి ఉంటారని బీజేపీ ఆరోపించింది. ఒకవేళ లిక్కరీ పాలసీ అమలులో ఆప్ ప్రభుత్వం క్లియర్గా ఉంటే, అప్పుడు ఆ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. కోట్లు లూటీ చేశారని, పన్నుదారుల కోట్ల రూపాయాలను కాజేశారని, లిక్కర్ మాఫియాతో కలిసి లిక్కర్ పాలసీని రూపొందించారని, అలాంటప్పుడు మీరు జైల్లోనే ఉండాలని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆరోపించారు.
సిసోడియాపై సీబీఐ దాడుల్లో రాజకీయ కోణం ఉన్నట్లు ఆప్ చేస్తున్న ఆరోపణలను గంభీర్ కొట్టిపారేశారు. ఒకవేళ వాళ్లు క్లీన్గా ఉంటే, అప్పుడు ఆ లిక్కర్ పాలసీనే కొనసాగించాల్సి ఉందని, కొత్త అబ్కారీ విధానాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారని గంభీర్ ప్రశ్నించారు.
మరోవైపు సీఎం కేజ్రీవాల్ మిస్కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ జాతీయ మిషన్లో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. భారత్ను నెంబర్ వన్ చేయాలంటే, 9510001000 ఫోన్ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వాలని, ఇండియాను టాప్ ప్లేస్లో నిలుపుదామని సీఎం కేజ్రీవాల్ ఓ వీడియో సందేశంలో అన్నారు.