న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారిగా ‘సివియర్ ప్లస్’కు చేరుకోవడంతో కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)ని అమలు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఈ కాలుష్య నివారణ ప్రణాళిక సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధిస్తారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని అధికారులు ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని స్పష్టంచేశారు.