కరీంనగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)/కమలాపూర్: హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అడుగడుగునా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించింది. శనివారం పోలింగ్ సమయం లో ఘర్షణలే లక్ష్యంగా, అనేకచోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఒకవైపు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు.. టీఆర్ఎస్పై ఉల్టా ప్రచారం చేశారు. వారితో దురుసుగా ప్రవర్తించి, గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు ప్రయత్నించారు. బీజేపీ అభ్యర్థి ఈటల కమలాపూర్లో ఓటుహక్కు వినియోగించుకొన్న అనంతరం అనుకూల మీడియా ఎదుట మాట్లాడి, తనకు ఓటువేయాలని అభ్యర్థించే ప్రయత్నంచేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఈసీకి ఫిర్యాదుచేశారు. ఈసీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం వద్ద నంబర్ ప్లేటు లేని మూడు వాహనాలను సీజ్చేశారు. వీటిలో ఈటల వ్యక్తిగత సహాయకుడు చైతన్యను అదుపులోకి తీసుకొన్నారు. ఆయనతోపాటు మరికొందరు స్థానికేతరులు ఆయా వాహనాల్లో ప్రయాణిస్తున్నట్టు గుర్తించినట్టు సమాచా రం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వీరు నంబర్ ప్లేట్లేని వాహనాల్లో పలు గ్రామాల్లో తిరిగినట్టు తెలుస్తున్నది.
వీణవంక మం డలం హిమ్మత్నగర్లో బీజేపీ నాయకురాలు తుల ఉమ ఓటర్ల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తుండగా స్థానికులు గోబ్యాక్ అంటూ నినదించారు. దీంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. జమ్మికుంటలో పలుచోట్ల బీజేపీ నాయకులు చిల్లరబుద్ధి ప్రదర్శించారు. గాంధీచౌక్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలను నెట్టేశారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంప్లాయీస్కాలనీలోనూ టీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. స్థానిక కౌన్సిలర్ ఇంటిలో డబ్బులున్నాయంటూ రోడ్డుపై హైడ్రామా నడిపేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టుచేశారు. డిగ్రీ కళాశాల, ఆబాది జమ్మికుంట, కోరపల్లి ప్రాంతాల్లో ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మాచనపల్లిలో మహిళలను టీఆర్ఎస్ నేతలపైకి ఎగదోసే ప్రయత్నంచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత మండలం వీణవంకలో ఆయనకు అనుకూలంగా ఓటిం గ్ జరుగుతున్నదని తెలుసుకున్న బీజేపీ నాయకులు చెడగొట్టు ప్రయత్నాలు తీవ్రస్థాయిలో చేశారు. తుల ఉమను రప్పించి గొడవలకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ నేత కౌశిక్రెడ్డి వీణవంక కు చెందిన నాయకుడే అయినా, స్థానికేతరుడంటూ ఘన్ముకుల ప్రాంతంలో ఆయనను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.
చల్లూరులో డబ్బులు పంచిన బీజేపీ నేతలు ఉల్టా ప్రచారం చేసి, టీఆర్ఎస్ నేతలను బంధించేందుకు ప్రయత్నించారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్లో కొంతమంది మహిళలను ఎగదోసి, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇప్పలనర్సింగాపూర్లో స్థానికేతరులు ఉన్నారని ఒక ఇంటిపై దాడికి ప్రయత్నించి, మహిళలను దుర్భాషలాడా రు. హుజూరాబాద్లోని సూపర్బజార్లో స్థానికేతరుడంటూ ఒక టీఆర్ఎస్ నేతపై బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు.