అమరావతి: ప్రకాశం జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జంక్షన్లలోని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో జిల్లా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేస్తున్నారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి వెళ్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. చీరాల పోలీసులు, రైల్వే పోలీసుల సహాయంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులను తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే ప్రయివేటు వాహనాలను సైతం పోలీసులు బస్ స్టేషన్లు, ఇతర జంక్షన్లలో జల్లెడ పడుతున్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా గుర్తించిన వారిని “చలో విజయవాడ” కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ చీరాల పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు.
కనిగిరి జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనంతపురం, కడప జిల్లాల నుంచి చలో విజయవాడకు వెళ్తున్న కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసు బలగాలను ఉపయోగించి ప్రభుత్వం ఆందోళనను అణచివేయాలని చూస్తోందని, అయితే తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఒంగోలు, కందుకూరు, సింగరాయకొండ, గిద్దలూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా ఉంచి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు.