Errabelli Dayakar Rao | జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని దేవరుప్పుల, కొడకండ్ల మండలకు సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన కాలువ బాటను సింగరాజుపల్లి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్ కి తరలించారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తామన్నారు. ఎర్రబెల్లిని భేషరతుగా విడుదల చేయాలని ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా తోపులాటలో ఎర్రబెల్లికి నుదుటికి స్వల్పంగా గాయం కావడంతో పోలీసులు దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.


