PNB Scam | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి అత్యంత సన్నిహితుడైన సుభాష్ శంకర్ పరాబ్ను సీబీఐ అధికారులు విజయవంతంగా కైరో నుంచి ముంబైకి తీసుకొచ్చారు. మంగళవారం ముంబైలో విమానం దిగగానే అతడ్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి.. ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. అతడికి ఈ నెల 26 వరకు న్యాయస్థానం సీబీఐ కస్టడీ విధించింది. సీబీఐ అభ్యర్థన మేరకు శంకర్ పరాబ్పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. 2018 ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి పరాబ్ కదలికలను దర్యాప్తు సంస్థలు కనిపెడుతూనే వచ్చాయి.
పీఎన్బీ స్కామ్పై దర్యాప్తు చేసిన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్లలో నిందితుడిగా శంకర్ పరాబ్ పేరు ప్రధానంగా చోటు చేసుకున్నది. ఫైర్స్టార్ ఇంటర్నేషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)గా సుభాష్ శంకర్ పరాబ్కు ఈ స్కామ్తో ఉన్న అనుబంధాన్ని సీబీఐ బయటపెట్టింది.
అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ హాంకాంగ్ శాఖలు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంట్వెర్ప్ శాఖల్లో బయ్యర్ క్రెడిట్ రూపేణా నిధులు స్వాహా చేశారు. ఎం/ఎస్ డైమండ్ ఆర్ యూఎస్, ఎం/ఎస్ సొలార్ ఎక్స్పోర్ట్స్, ఎం/ఎస్ స్టెల్లార్ డైమండ్ కంపెనీల తరపున ఈ మూడు బ్యాంకుల అధికారులకు ఈ-మెయిల్స్ పంపారు. నేరుగా ఆ అధికారులతో సంప్రదింపులు జరిపి నిధులు స్వాహా చేశారు. 2014-17 మధ్య పీఎన్బీ స్కాం జరిగినట్లు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి.
నీరవ్మోదీకి ఈ మూడు కంపెనీలు షెల్ కంపెనీలుగా ఉన్నాయి. నీరవ్ మోదీ అనుచరుడిగా సుభాష్ శంకర్ పరాబ్.. మనీ లాండరింగ్ లావాదేవీల కోసం ఈ షెల్ కంపెనీలను వాడినట్లు తేలింది. ఈ కంపెనీలు భారత్ నుంచి వజ్రాలు దిగుమతి చేసుకున్నట్లు పత్రాలు సృష్టించాడు. స్కాం వెలుగు చూడగానే కైరోకు పారిపోయాడు.
పీఎన్బీ స్కామ్పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టగానే నీరవ్ మోదీ, అతడి సన్నిహిత బంధువులు.. దుబాయి కేంద్రంగా పని చేస్తున్న తమషెల్ కంపెనీల డైరెక్టర్లను, హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న షెల్ కంపెనీలను కైరోకు మార్చేశారు. నీరవ్ మోదీ ఆదేశాల మేరకు ఈ డొల్ల కంపెనీల డైరెక్టర్లు భారత్కు వెళ్లొద్దని పరాబ్ ఒత్తిడి తెచ్చారని సీబీఐ వాదించింది. నీరవ్ మోదీ, అతడి సోదరుడు నిహాల్ మోదీతో కలిసి దుబాయిలోని షెల్ కంపెనీల డైరెక్టర్లను కైరోకు మార్చేయడంలో పరాబ్ కీలకంగా వ్యవహరించాడు. ఈ కంపెనీలకు నిజమైన వారసులం అని చెప్పుకునేలా పత్రాలు సృష్టించారని తెలిపింది.