న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును విమర్శిస్తున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కేవలం పర్సనల్ ఎజెండా కోసమే జాగ్రత్తపడుతున్నాయని ఆరోపించారు. కీలక ప్రభుత్వ ఆఫీసులు, మంత్రిత్వ కార్యాలయాలు ఎలా ఉన్నాయో ప్రతిపక్షాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. సుమారు 20 వేల కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. సెంట్రల్ విస్టా కింద కొత్త పార్లమెంట్ భవనంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను నిర్మించనున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు ఎలా ప్రవర్తించారో తెలుసు అని, స్వలాభం కోసం తప్పుడు సమాచారాన్ని చేరవేశారని, కానీ వాళ్లు ఎప్పుడూ ప్రభుత్వ కార్యాలయాల దీనస్థితి గురించి మాట్లాడలేదని, మంత్రులు పనిచేసే ఆఫీసులు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదని, రక్షణశాఖ కాంప్లెక్స్ గురించి వాళ్లు ఎన్నడూ పెదవి విప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. రక్షణశాఖ ఆఫీసు గురించి ప్రతిపక్షాలు మాట్లాడి ఉంటే, వాళ్లు చెప్పే అబద్దాలు బయటపడేవని మోదీ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తప్పుపట్టిన విషయం తెలిసిందే. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయం లోపే పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు.