న్యూఢిల్లీ : ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం వేదికగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. 5జీ సర్వీసులు తొలుత హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రాం, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో తొలి దశలో అందుబాటులోకి వస్తాయని టెలికాం శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇక 5జీతో రేడియేషన్ ప్రభావాలపై ఆందోళనను టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల తోసిపుచ్చారు. 5జీ ద్వారా వెలువడే రేడియేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించిన లెవెల్స్ కంటే చాలా తక్కువ ఉంటుందని చెప్పారు. సేవల నాణ్యతను మెరుగుపరచాలని టెలికాం ఆపరేటర్లను కేంద్రం కోరిందని ఆయన తెలిపారు.
ఐఐటీ మద్రాస్లో 5జీ ల్యాబ్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 5జీతో రూ 3 లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలోకి వస్తాయని దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడేండ్లలో దేశం నలుమూలలా 5జీ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.