భోపాల్ : మధ్యప్రదేశ్లో రాణి కమలాపతి రైల్వేస్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. భోపాల్లో నిర్వహించిన తొలి ‘జన్జాతీయ గౌరవ్ దివస్’ మహాసమ్మేళన్లో పాల్గొనేందుకు ప్రధాని ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా గేజ్ కన్వర్షన్తో పాటు విద్యుద్దీకరణ చేసిన ఉజ్జయిని-ఫతేబాద్ ఛంద్రావిగంజ్ బ్రాడ్ గ్రేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ మథేలా-నిమర్ ఖేరి బ్రాడ్ గేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ గుణ-గ్వాలియర్ సెక్షన్లను కూడా మోదీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేశారు. వీటితో పాటు ఉజ్జయిని-ఇండోర్, ఇండోర్-ఉజ్జయిని మధ్య నడిచే రెండు కొత్త ఎంఈఎంయూ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. రాణి కమలాపతి రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ప్రపంచస్థాయి మోడల్ స్టేషన్. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉండే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. రాణి కమలాపతి రైల్వే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రవేశ, ఎగ్జిట్ గేట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్లాట్ఫారాలపైకి చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఓపెన్ కాన్ కోర్స్లో 700 మంది నుంచి 1,110 మంది ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు తెలిపేలా వివిధ భాషలతో కూడిన డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. స్టేషన్లో ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ రూమ్లు, డార్మిటరీ, వీఐపీ లాంజ్ ఉన్నాయి. స్టేషన్లో దాదాపు 160 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి 24 గంటలూ నిఘా పర్యవేక్షించనున్నారు.