అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రమాద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాలు కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలో నెలకొన్న పరిస్థితిని జగన్ వివరించారు. సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లను వాడుకుంటున్నామని తెలిపారు.
సహాయక చర్యలు ఏవిధంగా కొనసాగుతున్నాయని మోదీ అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు పూర్తిగా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. ఎలాంటి సహాయం కావాలన్న తమను అడగాలని సూచించారు.