ముషీరాబాద్, జనవరి 31: ప్రధాని నరేంద్రమోదీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్కారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ప్రజాసంఘాల నేతలు సోమవారం విద్రోహదినం పాటించారు. అఖిల భారత రైతుపోరాట సమన్వయ కమిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి టీ సాగర్, కార్యదర్శి పశ్య పద్మ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేవీ చలపతిరావు మాట్లాడారు. రైతు ఉద్యమానికి తలవంచిన కేంద్రం.. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఉద్యమాన్ని విరమింపజేసి వాగ్దానాలు విస్మరించిందని విమర్శించారు. రైతులను ఆదుకోవడానికి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ఖేరీ హత్యాకాండకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించి, హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రాను పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక నాయకుడు విస్సా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.