న్యూఢిల్లీ : టోక్యో ఒలిపింక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులు నవ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆదివారం ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకుంటోందన్నారు.
దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చేసిన పోరాటం అసమానమన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అన్నారు. పతకాలు సాధించిన వారికి దేశం యావత్తు వారికి గౌరవం ప్రకటిస్తోందన్నారు. వాళ్లు పతకాలు మాత్రమే సాధించలేదు.. నవ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఒలింపిక్ పతక విజేతలను చప్పట్లు కొట్టి ప్రత్యేకంగా అభినందించారు.
దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతోందని ప్రధాని అన్నారు. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారి చేతు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయన్నారు. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయన్నారు. విభజన సమయంలో భారతదేశ ప్రజలు ఎదుర్కొన్న బాధలను దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 14 విభజన గాయాల స్మారక దినంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.