ఖైరతాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మాదిగల సంఘాల ప్లీనరీని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మార్చి 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. సోమవారం ఖైరతాబాద్ మింట్కాంపౌండ్లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో 18 మాదిగ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి మాట్లాడుతూ.. మాదిగ జాతి చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణపై తమ పోరు కొనసాగుతుందని చెప్పారు. వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఏడేండ్లు దాటినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి, తెలంగాణలోని మాదిగలకు 12 శాతం రిజరేషన్లు కల్పించాలని డిమాండ్చేశారు. ఏపీలో మాదిగలకు 7 శాతం ఇవ్వాలని, లేని పక్షంలో బీజేపీని తెలుగు రాష్ర్టాల్లో బొందపెడుతామని హెచ్చరించారు. మార్చి 10న మాదిగల సమగ్రాభివృద్ధిపై మేథోమధనం, 11న మహాసభ, 12న పొలిట్బ్యూరో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మాదిగ జేఏసీ నాయకులు బుల్లికొండ వీరేందర్, టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ ఆర్ఆర్ నాయకుడు రాయికంటి రాందాస్, టీఎంఎస్ఎస్ నాయకుడు గడ్డ యాదయ్య, ఎంహెచ్పీఎస్ నాయకుడు ఉపేందర్, మహాఎమ్మార్పీఎస్ నాయకుడు నర్సింగరావు, తెలంగాణ మాదిగ మహాసభ నాయకుడు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.