సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): పుష్కలంగా కురిసిన వర్షాలతో గ్రేటర్లోని చెరువులు జలసిరిని సంతరించుకోగా.. వాటిని హరిత శోభితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల వద్ద ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. చెరువు గట్లు, శిఖం భూములు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా అత్తాపూర్లోని మల్క చెరువు వద్ద చేపట్టిన ప్లాంటేషన్ను సీఎస్ సోమేశ్కుమార్ శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎక్కడ ఖాళీస్థలం కనిపించినా మొక్కలు నాటాలన్నారు. నగరంలోని అన్ని చెరువుల్లో మొక్కలు నాటే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. చెరువుల్లో నీటిమట్టం తగ్గగానే నీటి కానుగ(బేరింగ్ టోనియా)ను పెంచాలన్నారు. మల్క చెరువు మాదిరిగానే అన్ని చెరువుల్లో మోడల్ ప్లాంటేషన్ను చేపట్టాలన్నారు. మల్క చెరువులో దాదాపు 30 రకాల మొక్కలు నాటామని.. ప్రధానంగా స్థానికంగా లభించే జాతులనే ఎంచుకున్నామని అధికారులు సీఎస్కు వివరించారు. మల్టీ లేయర్ ప్లాంటేషన్ పద్ధతిలో వివిధ పుష్ప జాతులు, మెడిసినల్ ప్లాంట్లు, సువాసన వెదజల్లే మొక్కలు నాటామన్నారు. ఈ చెరువు కట్టపై కిలోమీటర్ మేర వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ పాల్గొన్నారు.