హైదరాబాద్, మార్చి 25: ప్రముఖ ఇన్వెస్టర్ ఝున్ఝున్వాలాకి చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ విమానాలు జూన్లో ఎగురబోతున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో వినయ్ దూబే వెల్లడించారు. హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడుతూ..మే చివరి వారంలో లేదా జూన్ తొలి వారంలో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని, తొలి విడుదల రెండు విమానాలతో సేవలు అందించనున్నట్లు చెప్పారు. తొలి ఏడాదికాలంలో 18 విమానాలు, ఐదేండ్లలో ఈ సంఖ్యను 72కి పెంచుకోవాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విమాన సేవలకు అవసరమైన లైసెన్స్లకోసం ప్రయత్నిస్తున్నట్లు అన్నారు. తొలుత ఏయే నగరాలకు అందిస్తారనే విషయంపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కానీ, భారత్లో మాత్రమే విమాన సేవలు అందిస్తామని చెప్పారు.
వచ్చే 20 ఏండ్లలో భారత్కు 2 వేల సింగిల్ ఎయిర్క్రాఫ్ట్లు అవసరమవుతాయని బోయింగ్ అంచనావేస్తున్నది. దక్షిణాసియా విమాన విభాగంలో భారత్ ఆధిపత్యం వహించనున్నదని అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ వెల్లడించింది. ఈ విమానాల విలువ 375 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత్ ఎయిర్ కార్గో సేవలు ప్రతియేటా 6 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, కేంద్రం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియాతో ఈ రంగం రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే లక్ష మంది నూతన పైలెట్లు అవసరమని వ్యాఖ్యానించింది.
దేశవ్యాప్తంగా చాపర్ అంబులెన్స్ సేవలు అందించడానికి ఎయిర్లిఫ్ట్ గ్లోబల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య శుక్రవారం అంగీకార ఒప్పందం జరిగింది.