స్వామి సేవలో తరించిన భక్తులు
శ్రీవారి ఖజానాకు రూ.27,64,712 ఆదాయం
యాదాద్రి, డిసెంబర్ 26: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున హాజరయ్యారు. వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో ఇలవేల్పు దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ఆలయ పురవీధులు, లడ్డూప్రసాద విక్రయశాల, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము 4గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో స్వామివారికి ఆరాధనలు ప్రారంభించారు. సుప్రభాతంతో స్వామివారి మేల్కొల్పిన అర్చకులు లక్ష్మీసమేత నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. హారతి నివేదనలతో అర్చించి, శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్దిణి సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారి బాలాలయంలో తిరుప్పావై వేడుకలు నిర్వహించారు. వేదమంత్రాలను పటిస్తూ గోదాదేవి రంగనాయకుడిపై రచించిన పాశురాలలో తొమ్మిదో పాశురాలను పఠిస్తూ భక్తులకు వినిపించారు. పాతగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. నారసింహ స్వామిని దర్శించుకునేందుకు పాతగుట్ట ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీవారి ఖజానాకు రూ. 27,64,712 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.