న్యూఢిల్లీ: రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఇవాళ రాజ్యసభలో రగడ సృష్టించాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇవాళ రెండు సార్లు రాజ్యసభను వాయిదా వేశారు. వెల్లోకి దూసుకువెళ్లిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నా .. విపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. దీంతో 2 గంటల వరకు డిప్యూటీ చైర్మెన్ సస్మిత్ పాత్ర సభను వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం రూల్ 267 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని చైర్మెన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు.
ఇక ఇదే పెట్రో అంశంపై ఇవాళ లోక్సభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ.. కాంగ్రెస్, టీఎంసీ, శివసేన పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. వెల్లోకి దూసుకువెళ్లిన డీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.