ముంబై : ప్రస్తుతం ఇంధన ధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర థానే ఘోడ్బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ పంప్ వినియోగదారులకే రూపాయికే లీటర్ పెట్రోల్ అందించింది. ఇందుకు కారణమేంటంటే.. సోమవారం స్థానిక శివసేన ఎమ్మెల్యే సర్నాయక్ జన్మదినం సందర్భంగా లీటర్ పెట్రోల్ రూపాయికే పంపిణీ చేశారు. అలాగే పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఇదో ప్రత్యేక మార్గమని ఎమ్మెల్యే మద్దతుదారులు పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త సందీప్ డోంగ్రే, అబ్దుల్ సలామ్ సహాయంతో థానే మున్సిపల్ మాజీ కార్పోరేటర్ ఆశా డోంగ్రే చొరవ తీసుకున్నారు.
వెయ్యి మందికి రూపాయికే లీటర్ పెట్రోల్ పంప్ నిర్వాహకులు పంపిణీ చేశారు. పంప్ నిర్వాహకులకు ఇప్పటికే రూ.1.20లక్షలు చెల్లించినట్లు సామాజిక కార్యకర్త సందీప్ తెలిపారు. రూపాయికే లీటర్ పెట్రోల్ పోస్తున్నారన్న వార్త తెలియడంతో పెట్రోల్ పంపు వద్దకు భారీగా వాహనదారులు చేరుకున్నారు. కొద్ది మందికే రూపాయికే పెట్రోల్ పోయడంతో పలువురు నిరాశతో వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరి సారిగా ఈ నెల 6న ధరలు పెరిగాయి. 16 రోజుల్లో పెట్రోల్, డీజిల్పై చమురు కంపెనీలు రూ.10కిపైగా పెంచాయి.