హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. చార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేయాలని, సీబీఐ విచారణ వేగంగా జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోర్టును కోరారు. ఇదే విషయమై ఇంతకు ముందు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు పాటు సుదీర్ఘ విచారణ జరిగింది.
అక్రమాస్తుల కేసులో బెయిల్పై ఉన్న జగన్, విజయసాయిరెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని రఘురామరాజు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే, తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ను కొట్టి వేసింది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.