ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ఎంత బాధపడ్డదో.. మళ్లీ తెలంగాణ ప్రజలు ఇప్పుడు అంతగా బాధపడుతున్నారు. సంక్షేమ సారథిని వదులుకున్నామా? అనే ఆత్మవిమర్శ ప్రజల్లో ఇప్పటికే మొదలైంది.
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఏ ఒక్కరూ ఉద్యమ నేత బాటలో నడవడానికి ముందుకు రాలేదు. మహామహులమని చెప్పుకొనే వారంతా ఆనాడు ఆంధ్రా పెత్తందారుల కింద అణిగిమణిగి ఉన్నారు. అయినా కేసీఆర్ ఒక్కరే ఒక శక్తిగా మారి తను నమ్ముకున్న నలుగురితో కలిసి తెలంగాణ సిద్ధాంతాన్ని నలువైపులా వ్యాపింపజేశారు. సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు తెలంగాణ వస్తే మారబోయే బతుకులపై ఆయన ఆనాడే వివరించారు. వాస్తవానికి కేసీఆర్కు పదవులే కావాలనుకుంటే తెలంగాణ ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. తన రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో పదవులను అనుభవించారు. పదవులను త్యజించి, తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 ఏండ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి ప్రజల్లో ఆయన చైతన్యాన్ని తీసుకొచ్చారు. తిరుగుబాటును రగిల్చి ప్రజల మద్దతుతో ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేశారు. సాధించుకున్న తెలంగాణకు అయిన అనేక గాయాలకు కేసీఆర్ ఓ ఔషధంగా మారారు. 60 ఏండ్ల సమైక్య పాలన చేసిన ఒక్కో గాయాన్ని మటుమాయం చేశారు. రాష్ట్రం కల సాకారమైన మరుక్షణం నుంచే క్షేత్రస్థాయిలో దృష్టి సారించి పతనమైన వ్యవస్థలన్నింటిని చక్కదిద్దారు. అభివృద్ధి, సంక్షేమంలో తన ప్రత్యేకతను చాటారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు మానవీయ పథకాలే. ప్రజలకు ఉపయోగకరమైన, ప్రజలపై ఉన్న భారాన్ని దించే పథకాలే. వాస్తవానికి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వ్యతిరేకించిన వారు కూడా వాటిని సద్వినియోగం చేసుకున్నా రు. రైతుబంధును వ్యతిరేకిస్తూనే వందల ఎకరాలు ఉన్న వివిధ పార్టీల నాయకులు పథక లబ్ధిని పొందారే కానీ, తమకు అక్కర్లేదు అని వెనక్కి పంపలేదు. పథకాల లబ్ధి పొందుతూనే కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందారు.
కేసీఆర్ రాజకీయ జీవితంలో ఓటములు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో హేళనలు, అవహేళనలను ఎన్నోసార్లు ఆయన ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదలని విక్రమార్కునిలా ప్రత్యేక రాష్ట్ర కాంక్షను సాకారం చేసేదాకా విశ్రమించలేదు. అటువం టి నాయకుడు ప్రజా తీర్పును గౌరవించి హుందాగా ప్రగతి భవన్ను ఖాళీ చేశారు. అనంతరం సాదాసీదాగా తన సొంత ఫామ్హౌస్కు వెళ్లిపోయారు. ఫామ్హౌస్లో ఉన్న ఆయన్ను కలిసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివెళ్లారు. తమ ప్రియతమ నేతను కలిసి అభిమానాన్ని చాటుకున్నారు. జనం గుండెల్లో కేసీఆర్ ఎంతగా స్థానం సంపాదించారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందే కంచె తొలగింపు పేరిట హడావుడి చేసింది. కానీ, ఆ కంచె ఏర్పాటు చేసిందే ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మరువకూడదు. తెలంగాణ ఉద్యమం కారణంగా అప్పట్లో కంచె వేసిన విషయం అందరికీ తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో అక్కడక్కడా లోపాలు ఉండటం సహజమే. వాటిని విధానపరంగా చూడాలే తప్పా.. వ్యక్తిగతంగా కాదు. చిన్నచిన్న విషయాలను ఎత్తిచూపుతూ కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ తాత్కాలిక ఆనందంలో మునగడం మంచిది కాదు. ఎన్నికల ప్రక్రియలో గెలుపోటములు సహజం. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఆయన ఆరోగ్య పరిస్థితులపై కూడా వ్యంగ్యంగా మాట్లాడడం సబబు కాదు. ఎవరూ అవునన్నా కాదన్నా అరవై ఏండ్లుగా అణచివేతకు గురైన తెలంగాణను తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సాధించిన వ్యక్తిగా ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణ ప్రజల గుండెల్లోంచి ఆయనను ఎవరూ చెరపలేరు.
– సంపత్ గడ్డం
78933 03516