న్యూఢిల్లీ, జనవరి 29: పెగాసస్ స్పైవేర్ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనంలో తేలడంతో ఈ అంశంపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కేంద్రప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలను ఎక్కుపెట్టాయి. స్పైవేర్ను వాడి అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహమేనంటూ మోదీ సర్కారుపై మాటల యుద్ధానికి తెరతీశాయి. బీజేపీ సర్కారు దేశాన్ని బిగ్బాస్ షోగా మార్చేసిందని దుయ్యబట్టాయి. అయితే, స్పైవేర్ వ్యవహారంలో కేంద్రప్రభుత్వాన్ని బీజేపీ నేతలు వెనకేసుకొచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ఒక సుపారీ మీడియా అంటూ ఎదురుదాడికి దిగారు.
ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారు..
ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ సర్కారు పెగాసస్ను కొనుగోలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రతిపక్ష నేతలు, సాయుధ దళాలు, న్యాయవ్యవస్థ ఇలా అందరి ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని.. ఇది ముమ్మాటికీ దేశద్రోహమేనని అన్నారు. పెగాసస్పై అబద్దాలు చెప్పి బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం బడ్జెట్ సమావేశాల్లో దీనిపై పార్లమెంటులో చర్చలేవనెత్తుతామన్నారు. పెగాసస్ స్పైవేర్ను రక్షణ పరంగా కాకుండా ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి బీజేపీ ఉపయోగించిందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. బీజేపీతో మాత్రమే ఇది సాధ్యమన్నారు. ఈ చర్యతో మోదీ సర్కారు దేశాన్ని బిగ్బాస్ షోగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ వ్యవహారంలో బీజేపీ వైఖరిని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎండగట్టారు. న్యూయార్క్ టైమ్స్ వార్తలను మోదీ ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం మౌనం నేరపూరిత చర్యకు పాల్పడినట్టు అంగీకరించడమేనని వామపక్షాలు పేర్కొన్నాయి.
దానికి విశ్వసనీయత ఎక్కడుంది?
పెగాసస్ వ్యవహారంలో ముప్పేట విమర్శలు వెల్లువెత్తుతుండటంతో బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. న్యూయార్క్ టైమ్స్ ఒక సుపారీ మీడియా అని కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ అభివర్ణించారు. ఆ పత్రికకు విశ్వసనీయత లేదన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనంపై కేంద్రప్రభుత్వం స్పందన కోరినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే, పెగాసస్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ విచారణ జరుపుతున్నదని, నివేదిక రావాల్సి ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.