రెండేళ్ల జైలు
అవగాహన కల్పిస్తున్న పోలీసులు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కమాన్పూర్ మండలంలో పదకొండు మందిపై కేసులు
సుల్తానాబాద్లో 30 మందికి ఫైన్
మాస్కు లేకుండా బయటకు వెళ్తున్నారా..? మాకేం అవుతుందిలే అనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త! కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సర్కారు సీరియస్గా వ్యవహరిస్తున్నది. ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించి, నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్శాఖ, మాస్కులు పెట్టకుండా ఎవరైనా రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తున్నది. వెయ్యి జరిమానా విధించడంతోపాటు రెండేండ్ల వరకు జైలు శిక్ష విధించనున్నది. పెద్దపల్లి జిల్లాలో 11 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు మరో 30 మందికి ఫైన్ వేసింది.
కమాన్పూర్/ సుల్తానాబాద్, మార్చి 30: కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. కొన్నిరోజుల నుంచి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు మరింత అప్రమత్తమైంది. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో నిబంధనలు కఠినతరం చేస్తూ, ఆదేశాలు జారీ చేసింది. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండేందుకు మాస్కులు తప్పనిసరి చేసింది. ఎవరైనా ధరించకుంటే వెయ్యి జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అవసరమైతే రెండేండ్ల జైలు శిక్ష పడేలా చట్టాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లోనూ స్పష్టం చేశారు. నిబంధనలు పట్టని వారిపై, మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం-2005లోని సెక్షన్ 51 నుంచి 60 కింద, ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, మెజిస్ట్రేట్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు.
ఇప్పటికే అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులు గుంపులుగా ఉండడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారితోపాటు మాస్కులు ధరించకుండా కనిపించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలో 40కి పైగా కేసులు నమోదు చేశారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత కమాన్పూర్ మండలానికి చెందిన పదకొండు మందిపై కేసులు పెట్టారు. బుధవారం వీరిని మంథని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ శ్యామ్ పటేల్ తెలిపారు. మంగళవారం కమాన్పూర్ మండలకేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే, సుల్తానాబాద్లోని రాజీవ్ రహదారిపై వాహనదారులకు ఎస్ఐ ఉపేందర్రావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మాస్క్లు ధరించని 30 మందికి వెయ్యి చొప్పున జరిమానా విధించారు.