నెమలికి నడకే కాదు సొగసు నేర్పాల్సిన పనీ లేదు! చిరుజల్లు చాలు.. మయూరం వయారాలు ప్రదర్శించడానికి! రుతురాగాల వేళ పదగతులతో పులకించి పురివిప్పడం నెమళ్లకు మామూలే.
భానుమూర్తి చురచురలాడే ఆమని వేళ.. నీలగ్రీవ పక్షి నీడపట్టున ఉండటానికే ఇష్టపడుతుంది. అయితే అకస్మాత్తుగా శ్రావణ మేఘాలు కమ్ముకొచ్చి నీటిజల్లు కుమ్మరించడంతో వీధికెక్కి ప్రకృతి సోయగాన్ని పరికిస్తూ ఉండిపోయింది. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ మార్గంలో ఆవిష్కృతమైందీ దృశ్యం.
ఆ మయూరం తన పరవశంలో తానుంటే.. శిఖి పింఛాల సొగసు చూస్తూ మురిసిపోవడం ఆ దారిన పోయేవాళ్ల వంతైంది! ఈ మయూర విన్యాసాన్ని ఏ కవిశేఖరుడో చూసి ఉంటే.. ‘ఇది వానల వేళయనీ.. ఇది చినుకుల మాసమనీ.. తొందరపడి ఒక కేకిక ముందే మురిసింది.. ముచ్చట గొలిపింది..’ అని పల్లవించేవాడేమో!