PCB – BCCI : కొన్ని ఏండ్లుగా భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)లు ఆడడం లేదు. అందుకనే. నిరుడు ఆసియా కప్ ఆతిథ్యాన్ని శ్రీలంకతో పంచుకున్న పాకిస్థాన్… ఈసారి స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) నిర్వహణకు సిద్దమవుతోంది. అయితే.. 2025లో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు ఆడుతుందా? లేదా? అని పాక్ బోర్డు సందేహంలో ఉంది. దాంతో, కొత్తగా పీసీబీ పగ్గాలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) టీమిండియా బోర్డు పెద్దల్ని ఒప్పించాలని అనుకుంటున్నాడు.
భారత జట్టు పాక్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ ఆడడంపై బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) నుంచి వాగ్దానం తీసుకోనేందుకు సిద్దమవుతున్నాడు. దుబాయ్లో జరిగే ఐసీసీ సర్వసభ్య సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందా? లేదా? అనే అంశంపై అతడు ఐసీసీ, బీసీసీఐ ప్రతినిధులను అడిగే అవకాశం ఉంది. ‘చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందా? లేదా? అనేది పాకిస్థాన్ క్రికెట్ బోర్డును తీవ్రంగా కలవరపెడుతోంది.
మొహ్సిన్ నఖ్వీ, జై షా
ఆసియా కప్ మాదరిగా జరుగుతుందా? అని పీసీబీ ఆందోళనతో ఉంది. ఇదొక ఐసీసీ ఈవెంట్. పైగా నిరుడు వరల్డ్ కప్ కోసం పాక్ జట్టు భారత్కు వెళ్లింది. అందుకని పాక్లో ఆడేందుకు టీమిండియాను పంపించాల్సిందిగా ఐసీసీ, బీసీసీఐని ఒప్పించేందుకు నఖ్వీ సిద్దమవుతున్నాడు. భారత జట్టు గనుక పాక్కు వెళ్తే.. చాంపియన్స్ ట్రోఫీని ఓ రేంజ్లో ప్రమోట్ చేసుకోవచ్చని పీసీబీ ఆలోచన’అని పాక్ బోర్డు వర్గాలు తెలిపాయి.
అయితే.. దాయాది గడ్డపై టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఆడాలా? వద్దా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. ‘ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే బీసీసీఐ నడుచుకోవాల్సి ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి, మార్చిలో ఉంది. టోర్నీకి ఏడాది సమయం ఉన్నప్పటికీ పీసీబీ చైర్మన్ ఇప్పటికిప్పుడే ఆడుతారా? లేదా? చెప్పాలని అడుగుతున్నాడు. ఇంత ముందుగా గవర్నమెంట్ అనుమతి కోరడం సరైంది కాదేమో’ అని బీసీసీఐ అధికారులు అంటున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా నిరుడు ఆసియా కప్ కోసం భారత జట్టును పాక్కు పంపమని బీసీసీఐ సెక్రటరీ జై షా తేల్చి చెప్పాడు. దాంతో, హైబ్రిడ్ మాడల్లో టోర్నీని నిర్వహించారు. ఐసీసీ ఆదేశాల మేరకు శ్రీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అయితే.. వన్డే వరల్డ్ కప్లో ఆడేందుకు పాక్ జట్టును ఆ దేశ ప్రభుత్వం భారత్కు పంపింది. దాంతో, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను దాయాది దేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం సిద్ధపడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.