హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులంటే దాదాపు 35 ఏండ్లపాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రజలకు సేవలందిస్తారు. పాలనారథానికి ఉద్యోగులే ఇరుసులు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన పాత్ర అంతాఇంతా కాదు. అందుకే రాష్ర్టావిర్భావం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ అందించింది. కనీవినీ ఎరుగని రీతిలో 43 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేసింది. మొన్నటికి మొన్న మరోసారి పీఆర్సీని ప్రకటించింది. కరోనా సమయంలోనూ వారిని కడుపులో పెట్టుకొని కాచుకొన్నది. ఎనిమిదేండ్లలో 14సార్లు కరువుభత్యాన్ని ప్రకటించి, ఉద్యోగ సంక్షేమంలో తమది తిరుగులేని ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు కానట్టుగా వ్యవహరిస్తున్నది. ఎనిమిదేండ్లలో జీతాల ఖర్చును తగ్గించుకోవడానికి అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోని మోదీ ప్రభుత్వం.. ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలింది. అదే సమయంలో ఆదాయపు పన్నును ముక్కుపిండి వసూలు చేస్తున్నది. గత ఎనిమిదేండ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి ఒక్కసారి కూడా ఉపశమనం కలిగించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినా.. అదంతా ఆదాయపు పన్ను చెల్లింపులకే వెళ్లిపోతున్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకోసారి కరువు భత్యం పెరగటం పరిపాటి. 2020లో కరోనా వచ్చినప్పటి నుంచి డీఏ చెల్లింపుల్లో కొంత జాప్యం జరుగుతున్నది. తెలంగాణ వంటి రాష్ర్టాల్లో కాస్త ఆలస్యమైనా సరే బకాయిలతో సహా చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గత 18 నెలలకు సంబంధించిన మూడు డీఏలను ఆలస్యమైనా చెల్లిస్తుందని.. దేశంలోని దాదాపు 1.10 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, ఆ మూడు డీఏలను చెల్లించేది లేదని కేంద్రం నిస్సిగ్గుగా చేతులెత్తేసింది. 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం ఇచ్చిన కానుక ఇది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తమతో ఇంత దారుణంగా వ్యవహరించిన సర్కారు ఇదేనని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ పేరుతో దాదాపు రూ.60-70 వేల కోట్లను మోదీ సర్కారు ఎగ్గొట్టిందని వారు మండిపడుతున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. ఉద్యమ భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తమది ఎంప్లాయ్ఫ్రెండ్లీ ప్రభుత్వమని పలుమార్లు ప్రకటించారు. ఆ దిశగా ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14సార్లు కరువుభత్యాన్ని ప్రకటించడం గమనార్హం. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థికపరమైన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా రాజీపడలేదు.
అర్ధ గణాంక శాఖలో సెక్షన్ న్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి 2017-18లో సరాసరి నెలసరి జీతం రూ.59,986 చొప్పున ఏడాది మొత్తం వచ్చే జీతం రూ.7,19,840. ఆ సమయంలో సదరు ఉద్యోగి చెల్లించే ఆదాయపు పన్ను రూ.71,037. అంటే సుమారు ఒకటిన్నర నెల జీతం.. సీఎం కేసీఆర్ పెంచిన జీతాల మేరకు అదే ఉద్యోగికి 2022-23లో నెలసరి సరాసరి జీతం రూ.1,30,212 చొప్పున ఏడాది మొత్తం వచ్చేది రూ.15,62,550. ఇప్పుడు ఆయన చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రూ.2.50 లక్షలు. అంటే జీతం 117% పెరిగితే… కేంద్రానికి చెల్లించాల్సిన పన్ను ఏకంగా 251% పెరిగింది. సదరు ఉద్యోగి సీఎం కేసీఆర్ జీతాలు పెంచినందుకు సంతోషించాలా? వచ్చిన జీతాన్ని మోదీ గుంజుకొంటున్నందుకు గుండెలు బాదుకోవాల్నా??
మోదీ సర్కారు వచ్చిన నాటినుంచి ఆదాయపు పన్నులో ఒక్క పైస కూడా మినహాయింపు ఇవ్వలేదు. పన్ను పరిమితిని రూ.10 లక్షలు చేయాలని కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు చాలాకాలంగా కోరుతున్నారు. మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయపు పన్ను ద్వారా వస్తున్నది మూడు శాతానికి మించి లేనప్పుడు దాన్ని రద్దు చేయడం ద్వారా ఉద్యోగులకు ఊరట కల్పించవచ్చన్న డిమాండూ చాలాకాలంగా ఉన్నది. కానీ మోదీ సర్కారుకు ఇవేవీ చెవికెక్కడం లేదు. దీంతో తెలంగాణ వంటి ప్రభుత్వాలు ఉద్యోగులకు మేలు చేసినా.. పన్ను రూపంలో అది మోదీ సర్కారు ఖజానాలోకి చేరిపోతున్నది.
ఉమ్మడి పాలన నుంచి సంక్రమించిన అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ తరహా మార్గాల్లో తాత్కాలిక ఉద్యోగుల శ్రమ దోపిడీ వ్యవస్థకు సీఎం కేసీఆర్ క్రమంగా చరమగీతం పాడారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. గత ఎనిమిదేండ్లలో 1,32,899 ఖాళీలను టీఎస్పీఎస్సీతో పాటు వివిధ శాఖల పరంగా భర్తీచేశారు. ఇప్పుడు మరో 91,142 పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇదే క్రమంలో కేంద్ర పాలకులు గత ఎనిమిదేండ్లలో దేశ వ్యాప్తంగా 6.90 లక్షల ఖాళీలు భర్తీచేశారు. ఇంకా భర్తీ చేయాల్సినవి 16 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం లెక్కల ప్రకారం కేంద్రంలో 60 లక్షల వరకు ఖాళీలున్నాయని సమాచారం. పైగా వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీ ఎత్తున అవుట్సోర్సింగ్ పోస్టులను సృష్టించి లక్షలమంది శ్రమను దోచుకొంటున్నారు. చివరకు సైన్యంలో కూడా అగ్నిపథ్ పేరుతో తాత్కాలిక జవానుల పోస్టులను సృష్టించారు. ఇవాళ బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రభుత్వాల పట్ల ఉద్యోగులకు శత్రుత్వం పెంచేందుకు కుట్ర చేయడానికి వెనుకాడటంలేదు. రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన రుణాలను అడ్డుకోవడం ద్వారా అడపాదడపా ఉద్యోగుల వేతనాలు ఆలస్యమయ్యేలా కేంద్రం పన్నాగం చేస్తున్నది.
కేంద్రం తెచ్చిన కొత్త కార్మిక చట్టాల్లో భాగంగా కార్మికుల కనీస పని వేళల్ని 8 గంటల నుంచి 12 గంటలకు చేయడంపై దేశవ్యాప్తంగా కార్మికలోకం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారానికి నాలుగు పని దినాలనేది పేరుకేగానీ… కేంద్రం తెచ్చిన 12 గంటల కనీస పని వేళలతో కార్పొరేట్ సంస్థలు ఓడీ (ఓవర్ డ్యూటీ) అలవెన్సులు ఎగ్గొట్టి… కార్మికుల రక్తాన్ని పీల్చుకుంటున్నాయనేది నిర్వివాదం. ఒక కార్మికుడు రోజుకు 8 గంటలకు మించి పనిచేస్తే గుండెపోటు వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంతర్జాతీయ సర్వేల సారాంశం ప్రకారమే గతంలో దానిని నిర్ధారించారు. మోదీ సర్కారుకు మాత్రం కార్మికుల ప్రాణాలకు విలువ లేదు.
తెలంగాణ ఉద్యమం మొదలు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం అడిగిన దాని కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడి ప్రభుత్వం జీతాలు పెంచుతుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం ఐటీ రూపంలో బాదుతున్నది.
– ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, గ్రేటర్ హైదరాబాద్ టీఎన్జీవో అధ్యక్షుడు
మోదీ సర్కారు రాకతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దుర్దినాలు మొదలయ్యాయని కేంద్ర ఉద్యోగ సంఘాల నాయకులు మొత్తుకొంటున్నారు. ఏడో వేతన సవరణ కమిటీ అమలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. 2013లో యూపీఏ సర్కారు ఏడో పీఆర్సీని వేసింది. మోదీ సర్కారు వచ్చాక రెండేండ్లు తర్వాత 2016లో దానిని అమలుచేసింది. నామమాత్రంగా వేతన సవరణ చేసి చేతులు దులుపుకొన్నది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పీఆర్సీలను అమలుచేశారు.