న్యూఢిల్లీ: ఎగురుతున్న విమానం అత్యవసర తలుపు తెరిచేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించడంతో విమానంలో కలకలం చెలరేగింది. సిబ్బంది సదరు వ్యక్తిని నిలువరించడంతో విమానంలో ప్రయాణిస్తున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. విమానం దిగిన తర్వాత సదరు ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు.
న్యూఢిల్లీ నుంచి వారణాసికి స్పైస్ జెట్ విమానం బయల్దేరింది. విమానం వారణాసిలో దిగేందుకు మరికొంత సమయం ఉండగా.. సీ1 వద్ద కూర్చున్న ఓ ప్రయాణికుడు.. టేకాఫ్ అయిన తర్వాత విమానంలో అటూఇటూ పచార్లు కొట్టాడు. ఉన్నట్టుంది విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన విమానం సిబ్బంది అతడ్ని వారించారు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు సదరు ప్రయాణికుడిని క్యాబిన్ సిబ్బంది అలాగే పట్టుకుని ఉన్నారు. వారణాసిలో విమానం దిగగానే ఆ ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు.
‘వారణాసికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో గౌరవ్ అనే ప్రయాణికుడు అకస్మాత్తుగా నిలబడి అత్యవసర తలుపు వద్దకు వెళ్లి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. వెంటనే మహిళా సిబ్బంది సహా ప్రయాణికులు ఆ ప్రయాణికుడిని పట్టుకున్నారు. విమానం వారణాసి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు అతడ్ని అలాగే పట్టుకున్నారు. విమానం ల్యాండ్ అవగానే పోలీసులకు అప్పగించాం’ అని స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత సదరు ప్రయాణికుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), స్పైస్ జెట్ భద్రతా సిబ్బందితో కలిసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మొత్తాన్ని ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కు స్పైస్జెట్ సంస్థ నివేదించింది. ఈ ప్రయాణికుడిని నో ఫ్లై-లిస్ట్లో ఉంచాలనే విషయాన్ని స్పైస్జెట్ ఎయిర్లైన్ సంస్థ ఇంకా నిర్ణయించలేదని తెలిసింది.
ఇండోనేషియాలో బాంబు పేలుడు.. 14 మందికి గాయాలు
సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ
అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..